హైదరాబాద్: కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పింది. ఆ ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని తేల్చిచెప్పింది.
ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ అప్రైజల్ను ప్రస్తుతం చేపట్టలేమని.. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు ట్రెబ్యునల్ పరిధిలో ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో రావాలంటూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ డీపీఆర్ను కేంద్రం తిరిగిన వెనక్కి పంపింది. ప్రాజెక్టుకు కేంద్ర సాయం విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
►ALSO READ | 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా.. మావోయిస్టుల అడ్డా కర్రెగుట్టలో అధికారుల స్వేచ్ఛా తిరుగుబాటు: డీజీపీ సీవీ ఆనంద్
ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి రాజ్య సభలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ జాతీయ హోదా గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 పరిధిలో అంతర్రాష్ట్ర అంశాలు ఉండటంతో టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ సాధ్యం కాదని, సమగ్ర ప్రణాళికతో డీపీఆర్ను మళ్లీ సమర్పించాలని సూచించారు. ప్రాజెక్టుకు సాయం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
