SRH New Captain: ఐపీఎల్ 2026 సీజన్కు ముందు అభిషేక్ శర్మకు అద్భుతమైన అవకాశం లభించింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాబోయే ఐపీఎల్ సీజన్లో కొన్ని మ్యాచ్లకు అతడ్ని కెప్టెన్గా నియమించింది. 2026 సీజన్ ఆరంభంలో అభిషేక్ శర్మ మంచి ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో వరుసగా రెండు అర్ధశతకాలు సాధించి ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో మాత్రం ఆశించినంతగా ప్రదర్శన లేకపోయాడు. ఆ టోర్నమెంట్ గ్రూప్ దశలో వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అవుతూ తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తం 8 మ్యాచ్లలో 141 పరుగులు మాత్రమే చేసి, అందులో రెండు హాప్ సెంచరీలు ఉన్నాయి. అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్లో అతను చేసిన ప్రదర్శన టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2024 సీజన్తోనే అభిషేక్ శర్మకు ఐపీఎల్లో గుర్తింపు వచ్చింది. అతను ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్తో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ చేశాడు. ఈ జంట పలుసార్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అద్భుతమైన ఆరంభం ఇచ్చింది. అదే ప్రదర్శనతో నేరుగా భారత జట్టులో చోటు సంపాదించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ సీజన్లోని ప్రారంభ మ్యాచ్లకు అభిషేక్ శర్మకు నాయకత్వ బాధ్యతలను టీమ్ యాజమాన్యం అప్పగించింది. పంజాబ్కు చెందిన ఈ యువ ఆటగాడికి ఇది కెరీర్లో కీలకమైన ఛాన్స్ గా భావిస్తున్నాడు. భవిష్యత్తులో టీమిండియాకు కూడా అతను నాయకత్వ పాత్రలో కనిపించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్కు పెద్ద సమస్యగా మారింది. 2025 జూలై తర్వాత అతను ఎక్కువగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఆస్ట్రేలియా– -ఇంగ్లాండ్ మధ్య జరిగిన యాషెస్ సిరీస్లో మాత్రమే కనిపించిన కమిన్స్ ఆ తర్వాత మళ్లీ వెన్నెముక గాయంతో 4 నెలలు క్రికెట్కు దూరమయ్యాడు. తిరిగి వచ్చిన కొద్ది రోజులకే మరోసారి గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. అందుకే ఆస్ట్రేలియా జట్టు తరఫున కూడా టీ20 వరల్డ్ కప్ ఆడలేదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సన్రైజర్స్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్, ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే జాక్ ఎడ్వర్డ్స్ కూడా 2026 బిగ్ బాష్ లీగ్ ఫైనల్ తర్వాత గాయపడ్డాడు.
ఇదిలా ఉంటే జట్టులో అనుభవజ్ఞులైన ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, దక్షిణాఫ్రికా వికెట్కీపర్ హైన్రిచ్ క్లాసెన్ ఉన్నప్పటికీ, జట్టు మేనేజ్మెంట్ అభిషేక్ శర్మను కెప్టెన్గా ఎంపిక చేసింది. ముఖ్యంగా హెడ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఒక టీ20 మ్యాచ్లో జింబాబ్వే జట్టుపై ఓడిపోవడం అతనికి మైనస్గా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇషాన్ కిషన్ ఇటీవల అద్భుతమైన ఫామ్లో కనిపిస్తున్నాడు. అతను జార్ఖండ్ జట్టును కెప్టెన్గా నడిపించి గత సీజన్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ కూడా అందించాడు. అయినప్పటికీ జట్టు కోచ్ డానియల్ వెటోరి, మేనేజ్మెంట్ యువ ఆటగాడు అభిషేక్ శర్మపై నమ్మకం పెట్టుకుని జట్టు పగ్గాలు అందజేసింది.
