
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఇరికించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశాడనే స్వాతి మలివాల్ ఆరోపణలపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆప్ నాయకురాలు ఆతిశీ స్పందించారు. దాడికి సంబంధించి మలివాల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆతిశీ తోసిపుచ్చారు. ఇదంతా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ను ఇరికించేందుకు బీజేపీ పన్నిన కుట్రగా పేర్కొంది. ‘‘తనపై క్రూరమైన దాడి జరిగిందని మలివాల్ ఆరోపించారు. కానీ ఈ రోజు వెలువడిన 52 సెకండ్ల వీడియోలో అందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి” అని ఆతిశీ అన్నారు. అందులో బిభవ్ కుమార్ను, సెక్యూరిటీ సిబ్బందిని మలివాల్ బెదిరిస్తున్న దృశ్యాలు ఉన్నాయని చెప్పారు.
సందర్భం లేకుండా వీడియోలు షేర్ అవుతున్నయి: స్వాతి మలివాల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై స్వాతి మలివాల్ స్పందించారు. ‘‘ఎప్పటి లాగానే, ఈసారి కూడా ఈ పొలిటికల్ హిట్మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన వ్యక్తులలో ఎలాంటి సందర్భం లేకుండా ట్వీట్లు చేయించడం, వీడియోలను షేర్ చేయించడం ద్వారా అతను ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోగలనని భావిస్తున్నాడు. ఒకరిని కొట్టడాన్ని ఎవరు వీడియో తీస్తారు? ఆ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలు బయటకు తీస్తే నిజం అందరికీ తెలుస్తుంది” అని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు.