హైదరాబాద్లోని ఓ బిర్యానీ హోటల్లో మొదలైన చిన్న తనిఖీ, దేశవ్యాప్తంగా దాదాపు 70 వేల కోట్ల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టింది. చాలా హోటళ్లు భారీగా లాభాలు సంపాదిస్తున్నా, ప్రభుత్వానికి మాత్రం తక్కువ ఆదాయం వస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఇలా పన్నులు కట్టకుండా తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం, గత కొన్నేళ్లుగా ఇలా దాదాపు 70వేల కోట్ల దాకా పన్ను ఎగవేత జరిగినట్లు తెలుస్తోంది.
ఎలా బయటపడిందంటే :
హోటళ్లలో బిల్లులు వేయడానికి ఉపయోగించే ఓ సాఫ్ట్వేర్ ద్వారా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా హోటళ్లు ఒకే రకమైన సాఫ్ట్వేర్ను వాడుతున్నాయి. అధికారులు సుమారు 1.77 లక్షల హోటళ్ల రికార్డులను, 60 టెరాబైట్ల డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చెక్ చేశారు.
కస్టమర్లు హోటల్ బిల్లు డబ్బులు కట్టేసిన తర్వాత, హోటల్ యజమానులు ఆ బిల్లులను కంప్యూటర్ సిస్టమ్ నుండి సైలెంట్గా తీసేయడం లేదా మార్చడం చేస్తున్నారని అధికారులు కనిపెట్టారు. దింతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే దాదాపు 5 వేల 100 కోట్ల అమ్మకాలను దాచేసినట్లు గుర్తించారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఈ సాఫ్ట్వేర్ వాడే హోటళ్లు మొత్తం 13 వేల కోట్ల విలువైన బిల్లులను డిలీట్ చేశాయి. కర్ణాటక రాష్ట్రం ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి.
హోటళ్లు చేసిన ట్రిక్స్:
హోటల్ యజమానులు పన్ను ఎగవేసేందుకు రెండు దారులను ఎంచుకున్నారు. కార్డులు లేదా UPI ద్వారా వచ్చే డబ్బు రికార్డుల్లో ఉంటుంది కాబట్టి, కేవలం డబ్బు రూపంలో వచ్చే బిల్లులను మాత్రమే సాఫ్ట్వేర్ నుండి తీసేసేవారు. కొన్నిసార్లు కొన్ని రోజుల డేటాను లేదా నెల మొత్తం జరిగిన అమ్మకాలను పూర్తిగా తీసేసి చాలా తక్కువ లాభం వచ్చినట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపించేవారు.
మొదట హైదరాబాద్, విశాఖపట్నంలో మొదలైన ఈ విచారణ, ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటివరకు దొరికిన డేటా ప్రకారం, హోటళ్లలో జరిగే మొత్తం అమ్మకాల్లో నాలుగో వంతు అంటే 25% లెక్కల్లో చూపించడం లేదని అధికారులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్కు సంబంధించిన విషయం మాత్రమేనని, ఇలాంటివి ఇంకా చాలా ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
