న్యూఢిల్లీ: టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి.. సౌతాఫ్రికా లెజెండ్ జాంటీ రోడ్స్ అప్లై చేశాడు. ఈ మేరకు తన అప్లికేషన్ను బీసీసీఐకి పంపినట్లు ధ్రువీకరించాడు. ‘ అవును.. కొత్తగా ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశా. నాకు, నా భార్యకు ఈ దేశం అంటే చాలా ఇష్టం. మాకు చాలా ఇచ్చింది. మా ఇద్దరు పిల్లలు ఇండియాలోనే పుట్టారు. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్గా 9 ఏళ్లు పని చేశా. గత ఐదేళ్లుగా టీమిండియా ఫీల్డింగ్లో చాలా పురోగతిని చూశా. అథ్లెటిజమ్, ఫీల్డింగ్ నైపుణ్యం బాగా పెరిగింది. ఆటగాళ్లు సాధించిన ఘనతకు గౌరవం ఇవ్వాల్సిందే. అయితే వీళ్లు సాధించిన ఘనతలకు కొన్ని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. హై ఫెర్ఫామెన్స్ కోచింగ్కు కొద్దిగా దూరంగా ఉన్నా.. గ్రాస్రూట్ కోచింగ్ను డెవలప్ చేయడంపై చాలా దృష్టి పెట్టా. ఇందులో నాకు చాలా అనుభవం ఉంది. బిజీ షెడ్యూల్ ఉండే టీమిండియాకు పని చేయడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తా’ అని 49 ఏళ్ల రోడ్స్ వ్యాఖ్యానించాడు.