హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి కారణంగా స్పోర్ట్స్ క్యాలెండర్ దెబ్బతిన్నది. వరల్డ్ వైడ్ చాలా టోర్నీలు రద్దయ్యాయి. కొన్ని వాయిదా పడ్డాయి. ఇండియాలో ఐపీఎల్ తర్వాత అత్యధిక ఆదరణ ఉన్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అయితే, ఈ మెగా ఈవెంట్కు ఢోకా లేదని, ఈ ఏడాది కచ్చితంగా జరుగుతుందని నేషనల్ కోచ్ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అంటున్నాడు. కరోనా ప్రభావం తగ్గితే నవంబర్ లేదా డిసెంబర్ వరకూ పీకేఎల్ షురూ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫారిన్ ప్లేయర్లు లేకపోయినా, ఫ్యాన్స్ను అనుమతించకపోయినా లీగ్ కళ తప్పుతుందని శ్రీనివాస్ రెడ్డి ‘వెలుగు’తో చెప్పాడు. ‘అంతా బాగుంటే జులైలో కొత్త సీజన్ మొదలు కావాలి. ఏప్రిల్లో న్యూ యంగ్ ప్లేయర్స్ ప్రోగ్రామ్ (ఎన్వైపీ), ఈ నెలలో కోచింగ్ ప్రక్రియ మొదలయ్యేది. జూన్ తొలి వారంలో ప్లేయర్స్ ఆక్షన్ జరిగేది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు, నాలుగు నెలల వరకూ ఎలాంటి టోర్నీలు ఉండవు. నాకున్న సమాచారం మేరకు నవంబర్, డిసెంబర్ వరకూ లీగ్ షురూ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇండోర్ గేమ్ కాబట్టి కచ్చితంగా జరుగుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ సాధ్యమయ్యేలా లేదు. బ్రాడ్కాస్టింగ్ స్లాట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి కబడ్డీ లీగ్కు అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి’ అని చెప్పుకొచ్చాడు.
ఫారినర్స్ రావాలి.. ఫ్యాన్స్ ఉండాలి
లీగ్లో ఫారిన్ ప్లేయర్లు ఆడాలని, అలాగే, ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించాలని శ్రీనివాస్ రెడ్డి సూచించాడు. ‘కొన్ని టీమ్స్లో ఫారినర్లే కీలక ప్లేయర్లు. ముంబై, పాట్నా జట్లలో చాలా మంది ఇరాన్, కొరియా ప్లేయర్లు ఉన్నారు. కానీ, ఆ రెండు దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అయినా సరే ఫారిన్ ప్లేయర్లు లేకుండా లీగ్ నిర్వహించే చాన్స్ లేదని భావిస్తున్నా. మన ప్లేయర్లు చాలా మంది ఉన్నప్పటికీ.. ఫారినర్స్ ఉంటేనే కళ వస్తుంది. డిసెంబర్ వరకూ కరోనా కంట్రోల్లోకి వస్తుందని భావిస్తున్నా. ఒకవేళ ఫారినర్లకు అనుమతి రాకపోతే మాత్రం ఇండియన్స్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. లీగ్లో మెజారిటీ ఆటగాళ్లు మనోళ్లే కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. అలాగే, ఈ లీగ్లో ప్లేయర్లకు, ప్రేక్షకులకు మధ్య ఒక బాండింగ్ ఉంది. అలాంటిది ఫ్యాన్స్ లేకుండా లీగ్ నిర్వహించడం అంటే కూరలో ఉప్పు లేనట్టే. బ్రతకాడానికి తినడం వేరు. టేస్టీగా తినడం వేరు. ఎవరికి వారు ఆడుకోవడానికి, జనాల మధ్య ఆడినదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా!. వితౌట్ ఫ్యాన్స్ అంటే లీగ్లో మజా ఉండదు. కాబట్టి వాళ్లు ఉండాల్సిందే. పైగా, ఇండోర్ స్టేడియాల కెపాసిటీ తక్కువే. మాగ్జిమమ్ నాలుగైదు వేల మంది వస్తారు. వాళ్లకు టెస్టులు చేసి అనుమతిస్తే సరిపోతుంది. చప్పట్లు ఉంటేనే కాదా కిక్కు, జోష్ వచ్చేది. ఒకవేళ ప్రేక్షకులను అనుమతించడం సాధ్యం కాదంటే మాత్రం వీవర్షిప్ భారీగా ఉంటుంది కాబట్టి ఖాళీ స్టేడియంలో అయినా నిర్వహించాల్సిందే’ అని లాస్ట్ సీజన్ వరకూ జైపూర్ పింక్ పాంథర్స్కు హెడ్ కోచ్గా ఉన్న శ్రీనివాస్ వివరించాడు. అయితే, ఈ సీజన్లో తాను ఏ ఫ్రాంచైజీకి వెళ్లాలో ఇంకా తేల్చుకోలేదని చెప్పాడు.
లోకల్ టోర్నీలకు టైం పడుతుంది
నాలుగు నెలల తర్వాత కొన్ని ప్రైవేట్ లీగ్లు జరిగినా.. కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు లోకల్, నేషనల్ టోర్నీలకు గవర్నమెంట్ అనుమతి ఇవ్వదని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్లేయర్లు ఒక్కచోటుకు వస్తే వారందరికీ టెస్టులు చేయడం కష్టం. పైగా, స్పోర్ట్స్ పర్సన్లలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ వైరస్ సోకినా కూడా చాలా రోజుల వరకూ బయటికి కనబడదు. అదంతా లాంగ్ ప్రాసెస్. కాబట్టి డిసెంబర్ తర్వాతే లోకల్ మ్యాచ్లు ఉంటాయి’ అని చెప్పాడు.
బ్రేక్తో ఫిట్నెస్ దెబ్బతింటుంది
ఇంత పెద్ద బ్రేక్ వచ్చినప్పటికీ.. ప్లేయర్లు మెంటల్గా డిస్టర్బ్ కారని శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ‘ఈ బ్రేక్ వల్ల ప్లేయర్ల స్టైల్, రిథమ్ ఏమీ దెబ్బతినదు. కానీ, కొంచెం ఫిట్నెస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బాడీ వెయిట్ పెరుగుతుంది. అయితే, ఇప్పుడు చాలా మందికి జిమ్ములు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తగిన కసరత్తులు చేసి ఫిట్నెస్ కాపాడుకోవాలి. జిమ్ములు లేని వాళ్లు చెమట వచ్చేలా ఏ పని చేసినా సరిపోతుంది. ప్రతి సీజన్లో ఆక్షన్ జరిగిన తర్వాత ప్లేయర్లకు కనీసం 45 నుంచి 60 రోజుల పాటు క్యాంపులు నిర్వహిస్తారు. మ్యాచ్ మూడ్లోకి వచ్చేందుకు ఆటగాళ్లకు ఆ టైమ్ సరిపోతుంది’ అని పేర్కొన్నాడు.