అనగనగా ఒక అడవి. దాని పేరు తడోబా. అందులో ఫాల్గుణ అనే పులి ఉండేది. కొన్నేళ్ల క్రితం అది కడంబా అనే మరో అడవికి వెళ్లి అక్కడే నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఫారెస్ట్ ఆఫీసర్లు వాటికి కే1, కే2, కే3, కే4 అనే పేర్లు పెట్టారు. ఇదే అడవికి ఇప్పుడు ఇంకో పులి వచ్చింది. అసలు పులులు ఈ అడవికి ఎందుకొస్తున్నాయి?
ఈ అడవిలో ఏముంది?
మహారాష్ట్రలోని తడోబా అడవి నుంచి 2015లో ఒక పులి.. పిల్లల్ని పెట్టేందుకు కుమ్రంభీం జిల్లాలోని కడంబా అడవికి వచ్చింది. అట్లనే ఈ మధ్య మరో పులి కూడా వచ్చింది. అసలు పులులు ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి అని ఫారెస్ట్ ఆఫీసర్లు రీసెర్చ్ చేశారు. దాంతో వాళ్లకు తెలిసింది ఏంటంటే..
కుమ్రంభీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల పరిధిలో సుమారు రెండు లక్షల హెక్టార్లలో అడవి ఉంది. ఈ అడవికి ఒక వైపు మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. అయితే.. తడోబా నుంచి ప్రాణహిత నది దాటి వచ్చే పులులు కాగజ్నగర్ అడవుల మీదుగా కవ్వాల్ అభయారణ్యం వెళ్తున్నాయి. కానీ.. కవ్వాలలో గిరిజనుల అలికిడి ఎక్కువ ఉండడంతో అవి అక్కడ ఎక్కువ టైం ఉండడంలేదు. అందుకే తిరిగి కాగజ్నగర్ అడవుల్లోనే భాగమైన కడంబాకు వస్తున్నాయి. ఇక్కడ ఏ సమస్యలు లేకపోవడంతో సేఫ్ ప్లేస్గా ఫీలవుతున్నాయి. ఈ అడవుల్లో జనసంచారం చాలా తక్కువ. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పులులు తల దాచుకోవడానికి గుహలు కూడా ఉన్నాయి. ఈ గుహల్లోనే ఫాల్గుణ నాలుగు పిల్లల్ని పెట్టింది. ఈ అడవిలోనే పెన్గంగా, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి.
‘శాకాహార జంతువులు ఈ అడవుల్లో ఎక్కువ. దాంతో తాగునీటికి , తిండికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా అడవి దట్టంగా ఉంటుంది. ఈ కారణాల వల్లే ఇక్కడికి పులులు ఎక్కువగా వస్తున్నాయి. దానివల్లే టైగర్ బ్రీడింగ్కుఈ ప్రాంతం అనువుగా ఉంద’ని బయాలజిస్ట్ లు చెప్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) కూడా ఇదే విషయం తేల్చి, ఈ ప్రాంతాన్ని టైగర్ కారిడార్, బ్రీడింగ్ సెంటర్గా గుర్తించింది. అందుకే ఇక్కడి అధికారులు ఈ అడవులకు దగ్గరలో ఉండే ప్రజలకు పులులపై అవగాహన కల్పిస్తున్నారు. చీటికిమాటికి అడవుల్లోకి వెళ్లొద్దని చెప్తున్నారు. వెదురు నరకడానికి, పొయ్యికట్టెలు కొట్టడానికి పర్మిషన్ ఇవ్వడంలేదు. ఎండాకాలం కాబట్టి జంతువుల కోసం తాగునీటి గుంటలు తవ్వించారు. శాకాహార జంతువుల కోసం గడ్డిని కూడా పెంచుతున్నారు.