2020 జూన్ 30 వరకు రేషన్ పోర్టబిలిటీని అమలు చేయడం ద్వారా పేదలు దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో అన్ని రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆహార శాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఒకసారి అన్ని రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం పూర్తయితే, అన్ని రాష్ట్రాల్లోని పాయింట్ ఆఫ్ సేల్స్ (POS) మిషన్ల ద్వారా మాత్రమే ఆహార ధాన్యాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంటే దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
‘ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకం అమలులో భాగంగా రేషన్, ఆధార్ అనుసంధానాన్ని చేపట్టామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరుకల్లా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో నిరుపేద వలస కార్మికులు స్థానిక రేషన్ షాపుల్లో సరుకులు తీసుకునే అవకాశం దగ్గరవుతుందని అన్నారు. అందరు రేషన్ కార్డుదారుల సమాచారం ఒకే సర్వర్ తో అనుసంధానం చేస్తామని చెప్పారు.