- ఖమ్మం మార్కెట్లో ఆల్టైం రికార్డు ధర
- రాష్ర్టంలోని ప్రధాన మార్కెట్లలో భారీ రేట్లు పలికిన కొత్త మిర్చి
- వరంగల్లో 20 వేలు,మలక్పేట్గంజ్లో 19,800
- తాలు మిర్చికీ క్వింటాల్ 10 వేల వరకు ధర!
- త్వరలో క్వింటా రూ.22 వేలకు చేరే అవకాశం
- 32 శాతం తగ్గిన సాగు..వర్షాల వల్ల పడిపోయిన దిగుబడి
- విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో పెరిగిన డిమాండ్
- పాత నిల్వలు లేకపోవడంతో కొత్త మిర్చికి మంచి ధరలు
- రైతన్నల సంతోషం.. లాభాలు వస్తాయని ఆశాభావం
హైదరాబాద్, వెలుగు:
మిర్చి మోత మోగుతోంది. రాష్ర్టంలోని వ్యవసాయ మార్కెట్లలో క్వింటాల్ ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం మిర్చి క్వింటాల్ రూ.21 వేలు పలికి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఖమ్మం, మలక్పేట్ గంజ్, వరంగల్ మార్కెట్లలోనూ భారీగా ధరలు పలికాయి. మిర్చికి ఈ స్థాయిలో రేట్లు రావడంతో వ్యాపారులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగితే రైతులకు సిరులు కురుస్తాయని చెబుతున్నారు. ఈసారి సీజన్ ప్రారంభం నుంచే మంచి ధర లభిస్తోందని రైతులు చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంట నవంబర్లోనే అమ్ముడుపోవడం, దక్షిణాది రాష్ట్రాల్లో మిర్చి వాడకం ఎక్కువగా ఉండటం, చైనా, థాయ్లాండ్, మలేషియా తదితర దక్షిణాసియా దేశాల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతోనే మిర్చి ధర పెరుగుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చలికాలంలో మిర్చి వాడకం సాధారణంగా ఎక్కువగానే ఉండటం కూడా మరో కారణమని చెబుతున్నాయి.
ఘాటు మిర్చి మోత
ఘాటు ఎక్కువ ఉండే మిర్చి రకానికి భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఇదే సమయంలో ఘాటు రకం క్వింటాల్ రూ.13 వేలు వరకు పలుకగా.. ఈ సారి రూ.5 వేల నుంచి 7 వేలకు పైగా అదనంగా ధరలు నమోదవుతున్నాయి. ఖమ్మం మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చి గురువారం రూ.21వేలు పలికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గత జూన్లో రూ.11వేలు పలికిన ధర.. నవంబర్ నాటికి పాత మిర్చి క్వింటా రూ.20,021 నుంచి రూ.20,500 వరకు పలికింది. ఇక హైదరాబాద్ మలక్పేట్గంజ్ మార్కెట్లో క్వింటాల్ రూ.19,800, వరంగల్ మార్కెట్లో 20 వేల వరకు ధర పలికింది. నంబర్ వన్ రకం 19,800 నుంచి 21,000 వరకు కలుకగా, నంబర్ టు రకం రూ.13 వేల నుంచి 16 వేల వరకు పలికింది. తాలు మిరపకాయలే క్వింటాల్ 10 వేల వరకు పలుకుతుండటం గమనార్హం.
త్వరలో క్వింటా రూ.22 వేలు!
తేజ రకానికి ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది పచ్చి మిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గింది. ధరల పెరుగుదలకు ఇది కారణమైంది. ధరలు ఇలానే కొనసాగితే క్వింటా రూ.22 వేలకు దాటవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అక్టోబర్ వర్షాల ఎఫెక్ట్
దేశవ్యాప్తంగా మిర్చి సాగు చేయడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలు కీలకం. ఏటా 3.98 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తూ మిర్చి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉన్నది. అయితే పంట వేసిన కొన్నాళ్లకే అకాల వర్షాలతో కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వరదల్లో పంట పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మిర్చి దిగుబడిపై భారీగా దెబ్బ పడింది. మన రాష్ట్రంతోపాటు ఏపీలోనూ మిర్చి పంట వర్షాలకు కొంత మేర దెబ్బతిన్నది. కొందరు రైతులు మిర్చి పంటకు ప్రత్యామ్నాయంగా వరి, మొక్కజొన్న సాగు చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు 1.81 లక్షల ఎకరాలు కాగా వర్షాల ప్రభావంతో 1.23 లక్షల ఎకరాల్లో మిర్చి సాగైంది. దాదాపు 60 వేల ఎకరాలు
(32శాతం) తగ్గిపోయింది. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల, కరీంనగర్, గద్వాల జిల్లాల్లో మిర్చి ఎక్కువ సాగు చేశారు.
ఎకరానికి రూ.6 లక్షల ఆదాయం
మంచి భూముల్లో ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. పెట్టుబడి ఖర్చు లక్ష వరకు వస్తోంది. క్వింటాల్ రూ.20 వేలు ధర పలికినా ఎకరానికి రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుందని, పెట్టు బడి ఖర్చులు పోను ఎకరానికి రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రు. పంట పూర్తిగా అమ్ముకునేంత వరకు ఈ ధరలే ఉంటే మంచి లాభాలు వస్తాయని అంటున్నారు.
గిట్టుబాటు అయితది
ఒక ఎకరాలో మిరప సాగు చేసిన. మొదటి విడత పంట తీస్తున్నం. ఇప్పటిదాకా పది క్వింటాళ్ల వరకు వేరి ఎండబోశాం. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వస్తది. మార్కెట్లో ధరలు చూస్తే గిట్టుబాటు అయ్యేలానే ఉంది. ఈ ఏడాది అధిక వర్షాలకు కొంత పంటలు దెబ్బతిన్నా తిరిగి పుంజుకున్నయి.- తద్దె వెంకటనారాయణ, ముత్తగూడెం, ఖమ్మం జిల్లా
మార్చి వరకు ఉంటే లాభమే
వర్షాలతో జాలు పెరిగి మిరపతోట పెట్టడం ఎనుకైంది. దసర తర్వాత ఎకరం వేశాం. కామునిపున్నం వరకు పంట వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న ధర మార్చి వరకు ఉంటే లాభమే.- మంగ చేరాలు, గొల్లగూడెం, మహబూబాబాద్ జిల్లా
ఎకరం సాగు చేసిన
ఎకరం మిర్చి వేశాం. నీటి పారకం తక్కువగా ఉంది. అయినా 15 కింటాళ్ల వరకు పండే అవకాశం ఉంది. ఇప్పటికే మెదటి విడత 3 క్వింటాళ్లు తీసినం. ధర బాగుండటంతో సంతోషంగా ఉంది.– కెంచ వెంకన్న, అర్పనపల్లి, మహబూబాబాద్ జిల్లా
ఎకరానికి 4 లక్షల లాభం వస్తది
8 ఎకరాలు మిరపతోట వేశాం. ధర మంచిగ ఉండటం సంతోషంగా ఉంది. మిరపకాయలు ఏరడానికి కూలీలు రూ.200లకు అడుగుతున్నరు. ధర ఎక్కువగా ఉందని అడిగినంత కూలీ ఇస్తున్నాం. అప్పుడు ఏడెనిమిది వేలే ధర ఉండేది. ఒక్క ఎకరానికి లక్షన్నర ఖర్చవుతుంది. ఎకరానికి మూడు నుంచి నాలుగు లక్షల లాభం వస్తుంది. ఇప్పుడు వర్షాలు వస్తే ఇబ్బంది. కాయలు తడిసి తాలుగాయలు అయి ధర తగ్గే అవకాశం ఉంది. – కోట వెంకట్రామ్రెడ్డి, బీరోలు, ఖమ్మం జిల్లా