- 4 నెలల్లో నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశాలు గాలికి
- 6 నెలలు గడుస్తున్నా రిపోర్టు ఇవ్వని ఎక్స్పర్ట్ కమిటీ
- ఆర్టీఐ అప్లికేషన్తో విషయం వెలుగులోకి
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంపై 4 నెలల్లో నివేదిక ఇవ్వాలన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ఆదేశాలు అమలు కాలేదు. ప్రాజెక్టు పనులు పరిశీలించి డీపీఆర్ రూపొందించడానికి అవసరమైన పనులకు మించి ఎంత ఎక్కువగా చేశారో నివేదిక ఇవ్వాలని జాయింట్ ఎక్స్పర్ట్ కమిటీని ఎన్ జీటీ ఆదేశించింది. ఏప్రిల్ 17వ తేదీలోగానే ఈ నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు సమర్పించలేదు. సుప్రీంకోర్టు అడ్వొకేట్ శ్రావణ్ కుమార్.. అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆర్టీఐలో చేసుకున్న దరఖాస్తుతో ఈ విషయం తేటతెల్లమైంది. ఇప్పటివరకు జాయింట్ కమిటీ రిపోర్టు తమకు అందలేదని ఢిల్లీలోని ఎంవోఈఎఫ్ సైంటిస్ట్ సుభాష్ ఉపాధ్యాయ్ సమాచారం ఇచ్చారు.
పర్మిషన్లు లేకుండానే పనులు.. పట్టింపేదీ?
ఏపీ ప్రభుత్వం 2020 మే నెలలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణతోపాటు, శ్రీశైలం నుంచి 800 అడుగుల లెవల్లో నీటిని లిఫ్ట్ చేసేలా సంగమేశ్వరం ఎత్తిపోతలకు పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా సంగమేశ్వరం నిర్మిస్తున్నారని, ఇది పూర్తయితే కృష్ణా బేసిన్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలు, హైదరాబాద్ తాగునీటిపై ప్రభావం పడుతుందని నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్.. ఎన్జీటీ (చెన్నై బెంచ్)ని ఆశ్రయించారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, డీపీఆర్కు అవసరమైన సర్వే సంబంధిత పనులు చేసుకోవచ్చని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ ఆదేశాలను సాకుగా ఏపీ ప్రభుత్వం లిఫ్ట్ స్కీం నిర్మాణ పనులను చేపట్టింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు డీపీఆర్కు అవసరమైన పనులే చేస్తున్నామంటూ ప్రాజెక్టు పంపుహౌస్, అప్రోచ్ చానల్, ఫోర్బే సహా ఇతర పనులను చేపట్టింది. దీంతో ఏపీ.. ఎన్జీటీ తీర్పును అతిక్రమించి ప్రాజెక్టు నిర్మిస్తున్నదని పిటిషనర్ మళ్లీ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనిపై నిరుడు డిసెంబర్17న గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు పనులు చేయాలని, పర్మిషన్లు వచ్చేదాకా ఆపాలని ఆదేశించింది. డీపీఆర్ కోసం ఎంత మేర పనులు చేపట్టాల్సి ఉందో నిర్ధారించాలని ఆదేశిస్తూ ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసింది.