న్యూఢిల్లీ: ప్రతి టోర్నీలో జావెలిన్ను 80 మీటర్లకు పైగా విసురుతున్నప్పటికీ.. 90 మీటర్ల మార్క్ చేరుకోవాలన్న ఒత్తిడి తనపై లేదని ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. కానీ ఏదో ఓ రోజు ఆ మార్క్ను అందుకుంటానని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ‘ఈసారి నేను టెక్నికల్గా చాలా బాగున్నా. జావెలిన్ టెక్నికల్ ఈవెంట్ కాబట్టి నేను రాణించగలుగుతున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 90 మీ. మార్క్ గురించి నిరాశ చెందడం లేదు. ఇదంతా పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజు ఎలా రాణించామన్నదే నాకు ముఖ్యం.
ప్రస్తుతం ఇండియన్ అథ్లెట్ల వైపు ప్రపంచం మొత్తం చూస్తున్నది. మన పెర్ఫామెన్స్ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ మంది టోర్నీల్లో పాల్గొనాలని నేను ఆశిస్తున్నా. ఎక్కువ టోర్నీల్లో ఆడటం వల్ల అనుభవం కూడా పెరుగుతుంది’ అని డైమండ్ లీగ్ చాంపియన్గా నిలిచిన తర్వాత చోప్రా పేర్కొన్నాడు. గత సీజన్లో బ్యాలెన్సింగ్ చాలా కష్టమైందన్నాడు. ఈసారి ఆఫ్, ఆన్ సీజన్ను సరిగా బ్యాలెన్స్ చేసుకుంటానని వెల్లడించాడు. కమర్షియల్ ఈవెంట్స్కు సంబంధించి ముందుగానే డేట్స్ ఇస్తానని, దానివల్ల ఫిట్నెస్ కాపాడుకోవడంతో పాటు ట్రెయినింగ్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశాడు.