జగన్ దెబ్బకు చంద్రబాబు అవిగన్ అంటున్నారు: పేర్ని నాని

జగన్ దెబ్బకు చంద్రబాబు అవిగన్ అంటున్నారు: పేర్ని నాని

సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. గురువారం ( ఆగస్టు 6 ) మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. జగన్ మావిగన్ దెబ్బకు చంద్రబాబు అవిగన్ అంటున్నారని అన్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు కలిపి సీఆర్డీఏలో తీర్మానం చేశారని.. రేపో మాపో దీనిపై క్యాబినెట్ తీర్మానం కూడా చేస్తారని... ఆ తర్వాత అసెంబ్లీలో కూడా పెడతారని అన్నారు.

జగన్ మావిగన్ అనేసరికి మాడు పగిలి చంద్రబాబు అవిగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బందర్ చుట్టాలు లేరు కాబట్టే మచిలీపట్నం కాకుండా అమరావతి చేర్చి అవిగన్ అంటున్నారని అన్నారు పేర్ని నాని. జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. జగన్ పర్యటనలో ఒక్క పోలీస్ కూడా కనిపించలేదని అన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు పేర్ని నాని.

జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. జనం రాకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టారని అన్నారు. పోలీసులను చంద్రబాబు ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటున్నారని అన్నారు. 

గతంలో మేదరమెట్ల, రాప్తాడు, సత్తెనపల్లి పర్యటనల్లో కూడా భద్రతా లోపాలు బయటపడ్డాయని అన్నారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రతా ఇదేనా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని.