గాంధీజీ ఐడియాలను నమ్ముతూ గాడ్సేను సమర్థించే వాళ్లతో కలిసి నడవలేరు.. ఆ రెండు ఐడియాలజీలకు పొత్తు కుదరదు. అయితే, గాంధీ వైపు లేదంటే గాడ్సే వైపు.. ఎవరో ఒకరివైపే ఉండాలి. ఇద్దరిలో మీరు ఎవరివైపు ఉంటారో చెప్పండి’ అంటూ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ను ప్రశ్నించారు. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన పీకే.. మంగళవారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు నితీశ్కుమార్ అంటే అభిమానమని అన్నారు. నితీశ్ కుమార్ తనకు తండ్రితో సమానమని చెబుతూ ఆయన గురించి చెడుగా మాట్లాడలేనని తెలిపారు. ఓ పార్టీ నాయకుడిగా తాను ఎవరివైపు ఉంటారో నితీశ్ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీజీ ఐడియాలజీని నమ్ముతానని, ఆయన అడుగుజాడల్లోనే ఎల్లప్పుడూ నడుస్తానని తనతో నితీశ్ చాలాసార్లు చెప్పారన్నారు. అధికారం కోసం ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని అడిగారు.