హైదరాబాద్, వెలుగు: చదరంగంలో తెలంగాణ నుంచి మరో గ్రాండ్ మాస్టర్ దూసుకొచ్చాడు. హైదరాబాద్కు చెందిన 19 ఏళ్ల పెద్ది రాహుల్ శ్రీవాత్సవ్ గ్రాండ్ మాస్టర్ హోదా అందుకున్నాడు. అర్జున్ ఎరిగైసి, హర్ష భరతకోటి, రాజా రిత్విక్ తర్వాత రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్గా, ఇండియా 74వ జీఎంగా నిలిచాడు. జీఎం హోదాకు అవసరమైన మూడు నార్మ్లను మూడేండ్ల కిందటే అందుకున్న రాహుల్.. తాజాగా 2500 ఎలో రేటింగ్ (ఫిడే రేటింగ్)పాయింట్ల మార్కు చేరాడు. ఇటలీలో జరుగుతున్న కటోలియా చెస్ ఫెస్టివల్ ఎనిమిదో రౌండ్లో లెవాన్ పసులయాతో గేమ్ను డ్రా చేసుకోవడం ద్వారా రేటింగ్ను 2500కు పెంచుకొని గ్రాండ్ మాస్టర్ అవ్వాలన్న తన కలను రాహుల్ నెరవేర్చుకున్నాడు.
ఎనిమిదేండ్ల నుంచే ఎత్తులు వేస్తూ..
హైదరాబాద్లో పుట్టిన రాహుల్ చిన్నప్పటి నుంచే చెస్పై ఆసక్తి చూపించాడు. ఎనిమిదేండ్ల వయసులోనే ఎత్తులు వేయడంతో పాటు మంచి జ్ఞాపకశక్తి చూపెట్టాడు. మెకానికల్ ఇంజనీర్ అయిన రాహుల్ తండ్రి శ్రీకాంత్కు కూడా చెస్ అంటే ఇష్టం. దాంతో, తొమ్మిదేండ్ల వయసు నుంచే రాహుల్కు మురళీ కృష్ణ, రామ రాజు దగ్గర కోచింగ్ ఇప్పించారు. రాహుల్ 13 ఏళ్ల వయసు నుంచి స్టేల్, నేషనల్ లెవెల్లో పోటీ పడి రెండుసార్లు స్టేట్ చాంపియన్ (అండర్9, అండర్11) అయ్యాడు. 2013లో నేషనల్ అండర్13 చెస్ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్షిప్ (అండర్14) , ఏషియన్ యూత్ చెస్ (అండర్10)లో బ్రాంజ్ మెడల్స్ గెలిచాడు. తన 15వ ఏటనే 2018లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా అందుకున్నాడు.
మా ఫ్యామిలీలో చెస్ ప్లేయర్లు లేకపోయినా.. ఒక హాబీగా నేను చెస్ ప్రారంభించా. మా పేరెంట్స్తో పాటు స్కూల్, కాలేజ్ నుంచి సపోర్ట్ రావడంతో ముందుకు సాగా. 2019లోనే గ్రాండ్మాస్టర్కు అవసరమైన మూడో నార్మ్ సాధించా. కానీ, అప్పటికి 2470 రేటింగ్ పాయింట్లే ఉండటంతో జీఎం అవ్వలేకపోయా. తర్వాత కరోనా కారణంగా టోర్నీలు ఆగాయి. నా రేటింగ్ పాయింట్లు కూడా తగ్గిపోయాయి. దాంతో, నేను జీఎం అయ్యేందుకు మూడేండ్లు ఆగాల్సి వచ్చింది. దానివల్ల నాపై ఒత్తిడి లేదు. కాకపోతే గ్రాండ్మాస్టర్ టైటిల్ సాధిస్తే ఓ భారం దిగిపోతుందని అనిపించేది. ఇప్పుడు జీఎం టైటిల్ నెగ్గడంతో హ్యాపీగా, రిలీఫ్గా ఫీల్ అవుతున్నా. తదుపరి టార్గెట్ అని ఏదీ పెట్టుకోలేదు. ప్రస్తుతం నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంపై ఫోకస్ పెడుతా. దాంతోపాటు చెస్ కూడా కొనసాగిస్తా.
‑ వెలుగుతో రాహుల్ శ్రీవాత్సవ్
30 పాయింట్ల కోసం మూడేండ్ల నిరీక్షణ
ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాక శ్రీవత్సవ్ మరింత స్పీడులో దూసుకెళ్లాడు. 2019లోనే గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరం అయిన మూడు జీఎం నార్మ్లను నాలుగు నెలల వ్యవధిలోనే అందుకున్నాడు. కానీ, రేటింగ్ పాయింట్లు తక్కువగా ఉండటంలో 2019లో అతను గ్రాండ్మాస్టర్ అవ్వలేకపోయాడు. ఈ లోపు కరోనా కారణంగా ఆటలకు బ్రేక్ పడింది. ఒక దశలో చెస్కు బ్రేక్ ఇచ్చి చదువుపై దృష్టిపెట్టాలని డిసైడయ్యాడు. 12వ తరగతి పూర్తి చేసుకొని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (యూటీడీ)లో ఎకనామిక్స్లో యూజీ కోర్సులో చేరాడు. చదువులోనూ చురుకైన శ్రీవాత్సవ్కు యూటీడీ పూర్తి స్కాలర్షిప్ ఇచ్చింది. అదే టైమ్లో యూనివర్సిటీ చెస్ టీమ్ నుంచి అతనికి సపోర్ట్ కూడా లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న రాహుల్ ఓవైపు చదువుతూనే చెస్ కొనసాగించాడు. 2468 రేటింగ్తో మూడు టోర్నీల్లో పాల్గొనడం కోసం నెల రోజు కిందట ఇటలీకి వచ్చిన ఈ హైదరాబాదీ ఎలాగైనా తన కలను నెరవేర్చుకోవాలని చూశాడు. ఈ మూడు టోర్నీల్లో కలిపి 26 రౌండ్లలో 32 ఎలో పాయింట్లు సాధించిన అతను మ్యాజిక్ మార్కు (2500) అందుకోవడంతో పాటు ఐదో జీఎం నార్మ్ కూడా సాధించాడు.