దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి తన వంతుగా నాలుగున్నర కోట్ల సాయం ప్రకటించారు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ. 2 కోట్లు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి అందజేస్తానని చెప్పారాయన. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ పండ్స్ కు చెరో కోటి రూపాయల చొప్పున అందిస్తానని తెలిపారు. తన సొంత జిల్లా అయిన కడప కలెక్టర్ కు ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయిస్తానని చెప్పారు సీఎం రమేశ్. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయలు కల్పించేందుకు ఈ సొమ్ము ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. గురువారం నాడు ఓ ప్రకటన ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.
కరోనా మహమ్మారిపై భారతదేశం చేస్తున్న పోరాటంలో తన వంతుగా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాలని తాను ఈ ఆర్థిక సాయం ప్రకటించినట్లు చెప్పారు సీఎం రమేశ్. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మనమంతా స్వీయ నిర్భందంలో ఉండి కరోనాను ఓడించాలని అన్నారు. ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించి ఈ వైరస్ ను మన దేశం నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు సీఎం రమేశ్.