నిజామాబాద్, వెలుగు: ఎకరాల కొద్దీవ్యవసాయ భూములున్న వారికే క్రాప్ లోన్స్ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫీసర్లు సతాయిస్తుంటారు. ఏవేవో డాక్యుమెంట్లు కావాలని రైతులను ముప్పు తిప్పలు పెడతారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని సిండి కేట్ బ్యాంక్ ఆఫీసర్లు మాత్రం గుంట భూమి లేకున్నా నకిలీ పట్టాలపై క్రాప్ లోన్లు ఇచ్చేస్తున్నారు. బ్యాంక్ ఆఫీసర్ మారితే తప్ప స్కామ్ బయట పడటం లేదు. జిల్లాలో గతంలో క్రాప్ లోన్స్ పేరిట కోట్లలో స్కామ్ జరిగింది. తాజాగా మళ్లీ మంగళ్పహాడ్లో ఇలాంటి వ్యవహారం వెలుగు చూసింది.
పాస్బుక్ లేకున్నా..
చందూర్ లక్ష్మి 2018, ఏప్రిల్ 28న రూ. 1.39 లక్షలు పంట రుణం తీసుకున్నారని, అప్పటి నుంచి
తిరిగి చెల్లించలేదని సిండి కేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ షోయబ్ చెబుతున్నారు. అయితే లక్ష్మి
పేరిట అసలు పాస్ బుక్కే లేదని రెవెన్యూ ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఏ డాక్యుమెంట్ల ఆధారంగా లోన్ ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. తాను కొత్తగా వచ్చానని, లోన్ మాత్రం లక్ష్మి పేరు మీదనే ఉందని, ఎలా ఇచ్చా రో తనకు తెలియదని బ్యాంక్ మేనేజర్ పేర్కొంటుండడం గమనార్హం.
.
గతంలో..
ఎడపల్లి మండలంలోని సిండి కేట్ బ్యాంక్ లో గతంలోనూ పంట రుణాల స్కామ్ వెలుగు చూసింది. గత సంవత్సరం ఆగస్ట్లో నకిలీ పట్టాలపై రూ.2 కోట్ల వరకు రుణాలిచ్చారు. అప్పట్లో మండలంలోని ఓ మీసేవా కేంద్రం నిర్వాహకుడు నకిలీ పహణీలు తీసివ్వడంతో ఏఆర్పీ క్యాంప్, ఎమ్మెస్ ఫారం, ఒడ్డాపల్లి, ఎడపల్లికి చెందిన చాలా మంది పేరిట అక్రమార్కులు ఈ రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో బ్యాంక్ ఆఫీసర్లు అసలు రైతులను ప్రశ్నించగా స్కామ్ బయటపడింది. ఆ టైంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్ సీపీ కార్తికేయశర్మ, మంత్రి ప్రశాంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధ్యులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఎదుట ధర్నా చేశారు. అయినాదీనిపై ఎలాం టి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎవరిపై చర్యలు తీసుకోలేదు. బ్యాంక్ ఆఫీసర్లు లోలోపల డబ్బులు రికవరీ చేసినట్లు సమాచారం. తాజాగా ఇదే మండలంలోని మంగళ్పహాడ్ బ్రాంచ్లో ఈ అవినీతి బాగోతం బయటపడింది.
క్రాప్లోన్స్ మాఫీ కోసమేనా!
రైతులకు చేయూతనందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం క్రాప్లోన్స్ మాఫీ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకునే అక్రమార్కులు నకిలీ పాస్ బుక్కులు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. గతంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే మళ్లీ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, ఇకనైనా ఆఫీసర్లు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.