కొత్త రెవెన్యూ చట్టంపై మంత్రులకు అవగాహన

కొత్త రెవెన్యూ చట్టంపై మంత్రులకు అవగాహన

బడ్జెట్ సమావేశాలు, కొత్త రెవెన్యూ చట్టం, NRI పాలసీ.. ప్రధాన ఎజెండాగా ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రెవెన్యూ చట్టంపై మంత్రులకు అవగాహన కల్పించనున్నారు సీఎం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ షెడ్యూల్ ఇవాళ ఫైనలయ్యే ఛాన్స్ ఉంది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు  క్యాంప్ ఆఫీస్ లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో పట్టణ ప్రగతి కార్యక్రమం తేదీలను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. పల్లె ప్రగతి మాదిరే పట్టణ ప్రగతిని వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ నెల 25 వరకు పంచాయతీ సమ్మేళనాలు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే మంత్రులను సీఎం ఆదేశించారు. అవి ముగియగానే పట్టణ ప్రగతి నిర్వహించనున్నట్లు సమాచారం.

కొత్త రెవెన్యూ చట్టం,ఎన్ఆర్ఐ పాలసీ కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ బిల్లులోని అంశాలను సీఎం మంత్రులకు వివరించే చాన్స్ ఉంది.

బడ్జెట్ సమావేశాల తేదీలపై కేబినెట్ లో చర్చించి ఫైనల్ చేయ నున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర NRI పాలసీపై కేబినెట్ డిస్కస్ చేయనుంది. పలు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రవాసుల.. సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇప్పటికే కేరళ NRI పాలసీపై.. ప్రభుత్వాధికారులు అధ్యయనం చేశారు. అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ఓ నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. వీటి ఆధారంగా సర్కారు ఓ పాలసీని రూపొందించింది. దీనిని ఈ బడ్జెట్ సెషన్ లోనే అసెంబ్లీకి తీసుకురానున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ముగిశాక సీఎం కేసీఆర్ గల్ఫ్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడున్న వారితో మాట్లాడనున్నారు.