హైదరాబాద్, వెలుగు : ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 ఎగ్జామ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 25 వేల మంది హాజరయ్యారు. మన రాష్ట్రంలో 14 సెంటర్లలో, సుమారు 12 వేల మంది రాసినట్టు సమాచారం. మ్యాథ్స్ పేపర్ కఠినంగా వచ్చిందని స్టూడెంట్లు తెలిపారు.
ఫిజిక్స్ పేపర్ నార్మల్గా రాగా, కెమిస్ట్రీలోని క్వశ్చన్లు ఈజీగా వచ్చాయని చెప్పారు. నిరుడితో పోలిస్తే ఈసారి పేపర్ కొంత కఠినంగా ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న వెబ్ సైట్లో స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు అప్లోడ్ చేస్తారు. 11న ఫైనల్ కీతో పాటు రిజల్ట్స్ వెల్లడిస్తారు.