- 24 నుంచి 26 వరకు శిక్షణ శిబిరం
- హాజరుకానున్న సంఘ్ చీఫ్ భగవత్
- బీజేపీ ముఖ్య నేతలకు ఆహ్వానాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఈ నెల 25న హైదరాబాద్ శివారులోని సరూర్నగర్ స్టేడియంలో భారీ సభను నిర్వహించనుంది. ఈ నెల 24 నుంచి 26 వరకు మూడురోజుల పాటు విజయ్ సంకల్ప్ పేరిట శిక్షణ శిబిరాన్ని చేపట్టనుంది. హైదరాబాద్శివారు సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో ఈ శిబిరం కొనసాగనుంది. ఈ రెండు కార్యక్రమాల్లో ఆరెస్సెస్చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ శాఖ ముఖ్య శిక్షక్ నుంచి ఆపై స్థాయి ప్రతినిధులు దాదాపు 15 వేల మంది శిబిరానికి హాజరుకానున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానాలు వెళ్లాయి.
శిబిరం, సభ కోసం భారీ ఏర్పాట్లు
ఆరెస్సెస్ శిక్షణ శిబిరం, సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ జరిగే సరూర్నగర్ స్టేడియానికి నాలుగు మార్గాల గుండా రూట్ మార్చ్ గా వేలాది మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. ఇందులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానోపన్యాసం చేయనున్నారు. సంఘ్ను మరింత పటిష్టం చేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.