- శరవణ భవన్ ఓనర్ రాజ్ గోపాల్ నసీబ్ ఇలా మారిం ది
- మూడో పెళ్లి చేసుకోవాలని జోతిష్యుడి సలహా
- తన దగ్గర పనిచేసే ఉద్యోగి కూతురిపై మనసుపడ్డ ‘దోశ కింగ్’
- పెళ్లి చేసుకోవాలంటూఆమెకు బె దిరిం పులు
- చివరికి అతని ఆదేశాలతో ఆమె భర్త హత్య
- జీవిత ఖైదు విధించిన కోర్టు..
చెన్నై: పేదరికం నుంచి వచ్చి కోటిశ్వరుడయ్యాడు. బయట ఫుడ్ తినడం తెలియని టైమ్లో రెస్టారెంట్ స్టార్ట్ చేసి సక్సెస్ కొట్టాడు. విదేశాలకూ రెస్టారెంట్ చైన్ విస్తరించాడు. చివరికి ఓ జోతిష్యుడి మాట విని మూడో పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యాడు. అందుకోసం ఓ హత్యకు పాల్పడి చివరికి యావజ్జీవ శిక్షకు గురయ్యాడు. ఇదంతా ‘దోశకింగ్’గా పేరుగాంచిన శరవణ భవన్ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు పి.రాజగోపాల్ లైఫ్ స్టోరీ. ఆదివారం నుంచి రాజగోపాల్ జీవత ఖైదు మొదలుకానుంది.
కిరాణా షాపు నుంచి..
వైట్ అండ్ వైట్ డ్రెస్.. నుదుటన గంధం బొట్టుతో కనిపించే రాజగోపాల్ వయసు 71 ఏళ్లు. తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని ఓ గ్రామంలో రాజగోపాల్ పుట్టాడు. ఆయన తండ్రి ఓ ఉల్లి వ్యాపారి. 1981లో రాజగోపాల్ చెన్నైలో కిరాణా షాపు పెట్టాడు. అది సక్సెస్ కావడంతో తెగించి తొలి రెస్టారెంట్ను ప్రారంభించాడు. అప్పటి వరకూ బయట ఆహారం తినడం అంటే జనం అంతగా ఇష్టపడని టైమ్లో ఈ రెస్టారెంట్ పెట్టాడు. తక్కువ ధరకే ఇంటి ఫుడ్ తిన్న ఫీలింగ్ కలిగేలా వెరైటీ దోశలు, వడలు, ఇడ్లీలతో జనాలను అట్రాక్ట్ చేసి రెస్టారెంట్ను సక్సెస్ చేశాడు. ఈ కాన్సెప్ట్ ఇండియాతో పాటు విదేశాలకూ పాకింది. ఇంటి ఆహారానికి మొహం వాచి ఉండే అమెరికా, గల్ఫ్, యూరోప్, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో 80 వరకు శరవణ భవన్ ఔట్లెట్లు పెట్టారు. స్టాఫ్ను కూడా చాలా బాగా చూసుకునే రాజగోపాల్ ను ఉద్యోగులు పెద్దన్న(అన్నాచ్చి) అని పిలుచుకుంటారు.
ఫేట్ మార్చిన అడ్వయిజ్
శరవణ భవన్ రెస్టారెంట్లలో దేవుడి పటాల పక్కనే రెండు రాజగోపాల్ ఫొటోలుంటాయి. ఒకటి ప్రస్తుతం వ్యాపారాలన్నీ నడుపుతున్న ఆయన కొడుకులతో ఉన్నదయితే. మరొకటి రాజగోపాల్కు నమ్మకమైన గురువుతో ఉన్నది. రాజగోపాల్ నమ్మకాలే.. ఆయన పతనానికి కారణమయ్యాయి. 2000 లో రాజగోపాల్కు జీవితాన్నే మార్చేసే ఓ సలహా ఇచ్చాడు ఓ జోతిష్యుడు. అది నమ్మి తన దగ్గరే పని చేసే ఓ ఉద్యోగి కూతురిని మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజగోపాల్. అప్పటికే పెళ్లయిన ఆమె రాజగోపాల్ ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. నో చెప్పినా వదలని రాజగోపాల్.. కొన్ని నెలల పాటు ఆమెను, ఆమె భర్తను, కుటుంబాన్ని వేధించాడు. చివరికి 2001లో రాజగోపాల్ ఆదేశాలతో అతని అనుచరులు ఆమె భర్తను హత్య చేశారు. 2004లో రాజగోపాల్ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. దీనిపై అప్పీలు చేయడంతో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మార్చిలో సుప్రీంకోర్టు ఈ శిక్షకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల 7న రాజగోపాల్ సరెండర్ కావాల్సి ఉంది. మిగతా జీవితమంతా అతను జైల్లో గడపాల్సిందే.