- జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుకు సెంట్రల్ టీమ్ ఓకే
- వీలైనంత తొందరగా జాగా ఇవ్వాలని రాష్ట్రానికి సూచన
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులోని తుర్కపల్లి (జీనోమ్ వ్యాలీ)లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బ్రాంచ్, వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుకు సెంట్రల్ హెల్త్ టీమ్ ఓకే చెప్పింది. ఎన్సీడీసీ అడ్వైజర్ డాక్టర్ కేఎల్ రమేశ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల టీమ్ బుధ, గురువారాల్లో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించిన పలు స్థలాలను పరిశీలించింది. ఈ టీమ్ గురువారం మధ్యాహ్నం హెల్త్ సెక్రటరీ, సీఎస్ సోమేశ్కుమార్తో వేర్వేరుగా సమావేశమైంది. వీలైనంత త్వరగా ఆ స్థలాన్ని తమకు హ్యాండోవర్ చేయాలని కోరింది. కేవలం జాగా ఇస్తే సరిపోతుందని.. బిల్డింగ్, ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ కోసం కేంద్ర నిధులు సిద్ధంగా ఉన్నాయని వివరించింది.
ఐసీఎంఆర్ అధీనంలో సైట్..
ప్రస్తుతం సెంట్రల్ టీమ్ ఓకే చెప్పిన తుర్కపల్లి(జీనోమ్ వ్యాలీ) సైట్ ఐసీఎంఆర్ అధీనంలో ఉంది. ఇక్కడ ‘నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్’ సంస్థను ఐసీఎంఆర్ రన్ చేస్తోంది. ఈ సైట్ ఎన్సీడీసీకి ఇవ్వాలంటే, ఐసీఎంఆర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని హెల్త్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. అయితే, ఇక్కడ ల్యాండ్ ఇచ్చేందుకు స్టేట్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని హెల్త్ సెక్రటరీ వారం రోజుల క్రితం ఎన్సీడీసీ డైరెక్టర్కు రాసిన లెటర్ లో పేర్కొన్నారు. కాగా, కర్కపట్లలోని జీనోమ్ వ్యాలీ మూడో ఫేజ్ వద్ద ఓ సైట్ను, రంగారెడ్డి జిల్లాలోని ఫార్మాసిటీలో మరో సైట్ను సెంట్రల్ టీమ్కు చూపించారు. కానీ వీటిని రిజెక్ట్ చేసింది. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఓల్డ్ బిల్డింగ్ను సైతం టీమ్ పరిశీలించింది. అక్కడ టెంపరరీగా ల్యాబ్ ఏర్పాటు చేయాలని రాష్ర్ట సర్కార్ కోరింది. ఈ ప్రతిపాదనపై కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
దేశంలో 8 వైరాలజీ ల్యాబ్ లు
ప్రస్తుతం పుణె సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్సీడీసీ వైరాలజీ ల్యాబ్లు ఉన్నాయి. మరో 9 రాష్ట్రాల్లో నిర్మాణ దశల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో ల్యాబు ఏర్పాటు చేయాలని మూడున్నరేండ్లుగా కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తోంది. కానీ, ఇన్నాళ్లు రాష్ట్ర సర్కార్ భూమి కేటాయించకపోవడంతో, ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. కరోనా ఎఫెక్ట్ తో అన్ని రాష్ట్రాల్లో వైరాలజీ ల్యాబ్లు అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో మైక్రోబయాలజిస్టుల, ఎంటమాలజిస్టులు సహా అన్ని విభాగాల పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అన్ని రకాల ఎక్విప్మెంట్లు అందుబాటులోకి వస్తాయి. కరోనా, జికా, ఎబోలా వంటి కొత్త వైరస్ల టెస్టులు ఇకపై హైదరాబాద్లోనే అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం జికా, ఎబోలా తదితర సస్పెక్టె డ్ కేసుల శాంపిళ్లను పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపి టెస్టులు చేయిస్తున్నారు. కరోనా వచ్చిన కొత్తలోనూ శాంపిళ్లను పుణె ల్యాబ్కే పంపారు. ఎప్పుడైనా కొత్త వైరస్లు, వింత వ్యాధులు, వింత లక్షణాలు కనిపించిన వెంటనే.. శాంపిళ్లను టెస్టు చేసి, రోగ నిర్ధారణ చేసేందుకు వైరాలజీ ల్యాబ్ కీలకం. కేవలం డయాగ్నసిస్ సేవలే కాకుండా.. అంటువ్యాధులపై పరిశోధనలు చేయడం, కొత్త వైరస్లను గుర్తించడం కూడా చేస్తారు.