- ఫ్రీ వాటర్ స్కీం గడువు రెండుసార్లు పెంచినా.. ఫ్లాట్ల ఓనర్లు స్పందించలె
- అవగాహన కల్పించకుండా అధికారుల నిర్లక్ష్యం
- ఆధార్ సీడింగ్ చేయించుకోని లక్షన్నర మంది
హైదరాబాద్,వెలుగు: ఫ్రీ వాటర్ స్కీంకు అపార్టుమెంట్లలోని ఫ్లాట్ల ఓనర్ల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. రెండుసార్లు గడువు పెంచినా కూడా లక్షన్నర మంది ఓనర్లు ఎన్ రోల్ చేసుకోలేదు. ఆధార్ సీడింగ్, మీటర్ను తప్పనిసరిగా ఫ్లాట్ల ఓనర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా వాటర్ బోర్డు రూల్స్తో ఇంట్రెస్ట్ చూపలేదు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో కూడా కొందరు స్కీం ఎన్రోల్ మెంట్కు ముందుకు రాలేదు. ఇంటింటి క్యాంపెయిన్ చేయాల్సిన అధికారులు, సిబ్బంది ఆఫీసులకే పరిమితమయ్యారు. స్కీం ఎన్ రోల్ మెంట్కు ఈ నెల15తో రెండోసారి గడువు ముగిసింది. ఆధార్ లింకేజీ, పనిచేసే వాటర్ మీటర్ ఉంటేనే 20 వేల లీటర్ల నీటిని ఫ్రీగా పొందుతారు. సిటీలో మొత్తం 10.08 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, ఆధార్ సీడింగ్, మీటర్ పెట్టుకోవాల్సిన కనెక్షన్లు 8లక్షల పైనే ఉన్నాయని గుర్తించారు. డొమెస్టిక్ స్లమ్లలో ఆధార్ సీడింగ్ దాదాపు పూర్తి కాగా, 7.87లక్షలు ఉన్న డొమెస్టిక్ వినియోగదారుల నుంచి అనుకున్నంతగా ఎన్ రోల్ మెంట్ లేదని తేలింది. ఇందులో ఫ్రీ వాటర్ స్కీం కంటే ముందే 2.20లక్షల మంది ఆధార్, మీటర్లను కలిగి ఉండగా, మిగిలిన 5.67లక్షల్లో కనీసం ఇప్పటికీ పూర్తి కాలేదు.
ప్రతి ఫ్లాట్ ఓనర్ ఆధార్ను కూడా..
వాటర్బోర్డు పెట్టిన రూల్స్ ప్రకారం ఫ్రీ వాటర్ కు అర్హత పొందాలంటే అపార్ట్మెంట్లలోని ప్రతి ఫ్లాట్ ఓనర్ నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్ను లింక్ చేసుకోవాలి. ప్రతి అపార్ట్మెంట్కు ఒకటే కనెక్షన్ ఉంటుంది. కానీ ఫ్లాట్స్ పదుల సంఖ్యలో ఉంటాయి. ప్రతి ఫ్లాట్ ఓనర్ఆధార్ను కూడా సీడింగ్ చేయాలనే రూల్తో అయోమయంలో పడ్డారు. సిటీలో చాలా ఫ్లాట్లు ఓనర్ల పేరిట ఉండగా, వాటిలో ఉండేది టీనెంట్లు కావడంతోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి ప్లాట్ పీటీఐఎన్ వివరాలు సరిపోలక కూడా నమోదు ప్రక్రియకు అడ్డంకిగా మారింది.
సీడింగ్ చేసుకున్న వారికి..
నల్లా కనెక్షన్ వివరాలు మారడం కూడా కస్టమర్లను కన్ఫ్యూజన్లో పడేసింది. స్కీం ప్రకటన వచ్చిన నాటికి డొమెస్టిక్ స్లమ్ కేటగిరీలోని బిల్డింగ్ డొమెస్టిక్ కేటగిరీలోకి మారింది. దీంతో ఆధార్ సీడింగ్తో పోయేదానికి మీటర్ తోపాటు, ప్రతి ఫ్లాట్ లో ఉండేవారి ఆధార్ ను నమోదు చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకుని ఉన్నా కూడా 6 నెలల పెండింగ్ బిల్లులను వాటర్ బోర్డు జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తాయి.
మరోసారి గడువు పెంచాలె !
చాలా మంది ఆధార్ సీడింగ్ , వాటర్ మీటర్ చెకింగ్ చేసుకోలేదు. మీటర్ పనిచేయకపోతే స్కీమ్కు అనర్హులంటూ, 9 నెలల బిల్లులను ఒకేసారి చెల్లించాలని వాటర్ బోర్డు నెల రోజులుగా చెప్తోంది. ఇప్పటికీ ఆశించినంత మార్పు వాటర్ మీటర్లపై రాలేదు. ఆధార్ సీడింగ్ చేసుకుని, మీటర్లు బిగించుకోవాలంటే మరో 15 రోజులు గడువు ఇవ్వాలని కస్టమర్లు కోరుతున్నారు.