మహిళ తల నరికి.. మూసీలో పడేశారు..

 మహిళ తల నరికి.. మూసీలో పడేశారు..


ఎంత దారుణం.. ఘోరం.. మనిషి రక్తం చూస్తేనే కళ్లు తిరుగుతాయి అలాంటి.. ఇప్పుడు మనుషులను చంపటం నుంచి..శరీరాన్ని ముక్కలు ముక్కలు నరికే స్థాయికి వచ్చేశారు దుర్మార్గులు. కసి, కోపం, పగ ఏ స్థాయిలో ఉంటున్నాయో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న సొంత సోదరుడు చనిపోయాడని.. అంత్యక్రియలకు డబ్బులు లేవంటూ.. బాడీని ముక్కలు ముక్కలుగా చేసిన ఘటన షాకింగ్ కు గురి చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా.. 2023, మే 17వ తేదీ హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న మూసీ నదిలో ఓ మహిళ తల కనిపించటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడ మూసీ నది ఒడ్డున ఓ మహిళ తల కనిపించింది. ఓ ప్లాస్టిక్ కవర్ లో ఉన్న తలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొండెం లేని తలను ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు చెబుతున్నారు. మొండెం ఎక్కడ ఉందో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఎక్కడో హత్య చేసి.. తలను కోసి.. మూసీ నదిలో పడేసిట్లు ఘటనా స్థలాన్ని చూస్తే అర్థం అవుతుంది. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మొండెం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్ టీమ్స్ స్పాట్ కు చేరుకున్నాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అడిషనల్ డీసీపీ ఆనంద్ స్పాట్ కు వచ్చి విచారణ చేస్తున్నారు.

ఈ మహిళ ఎవరు.. ఏ ప్రాంతానికి చెందిన వారు.. హత్య చేయటానికి కారణాలు ఏంటీ.. చేసింది ఎవరు.. ఎప్పుడు, ఎక్కడ హత్య జరిగింది.. తలను వేరు చేయటానికి కారణాలు ఏంటీ అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. తల ఆధారంగా మహిళ ఎవరు అనేది గుర్తించటానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు.