శ్మశానవాటికనూ రిజిస్ట్రేషన్ చేసిన్రు

శ్మశానవాటికనూ రిజిస్ట్రేషన్ చేసిన్రు
  • గద్వాల జిల్లా మానవపాడులో రెవెన్యూ ఆఫీసర్ల నిర్వాకం 

గద్వాల/మానవపాడు, వెలుగు: శ్మశానవాటికను సైతం రిజిస్ట్రేషన్ చేసిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓవైపు అసైన్డ్​ భూములనే కారణంతో రైతుల నుంచి పచ్చని పంట పొలాలను సైతం గుంజుకొని శ్మశానవాటికలను నిర్మిస్తున్న రెవెన్యూ ఆఫీసర్లు, ఈ గ్రామంలో ఏకంగా శ్మశానవాటికనే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్​ చేయడం గమనార్హం. పెద్దపోతులపాడు గ్రామంలోని సర్వే నంబర్ 9/ఏ/1లో 5.20 ఎకరాల భూమిలో కొన్నేండ్లుగా శ్మశానం ఉంది. కొన్ని దశాబ్దాల కిందే రుక్మిణమ్మ అనే మహిళ ఈ భూమిని శ్మశానానికి దానం చేశారు. అది శ్మశానం అనే తప్ప గతంలో దానంగా ఇచ్చిన భూమి అనే విషయం చాలామందికి తెలియదు. చాలా ఏండ్లుగా  గ్రామస్తులు ఎవరు చనిపోయినా ఈ శ్మశానంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ స్థలంపై రుక్మిణమ్మ వారసుల కన్నుపడింది. శ్మశానం కావడంతో సర్వే నంబర్ 9/ఏ/1ని ఇన్నాళ్లూ హోల్డ్​లో పెట్టారు. దీనిని రిజిస్ట్రేషన్​చేయడానికి వీలులేదు. అలాంటిది ఆఫీసర్ల సహకారంతో గత ఆగస్టు నెలలో 5.20  ఎకరాల భూమిని  బెలగంటి మణివర్ధన్​రెడ్డి, గుమ్మా రెడ్డి పల్లె కృష్ణవేణి, మల్లెపల్లి వెంకటేశ్వరమ్మ, యాగంటి హైమావతి, సాంబయ్యగారి రమాదేవి పేర్లపై రిజిస్ట్రేషన్​చేయించుకున్నారు. తర్వాత వీరిలో ఒకరైన సాంబయ్యగారి రమాదేవి తన పేరుమీద ఉన్న 30 గుంటల స్థలాన్ని సింగవరం దివాకర్ రెడ్డికి సెప్టెంబర్​4న  రిజిస్ట్రేషన్ చేశారు. తీరా విషయం బయటకు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  శ్మశానవాటిక కోసం ఏనాడో రాసిచ్చిన స్థలాన్ని ఎవరికీ తెలియకుండా రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారసులు, వారికి సహకరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవమే..
సర్వే నంబర్ 9/ఏ/1లోని 5 ఎకరాల 20 గుంటల భూమిని రుక్మిణమ్మ వారసుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవమే. ఇందులో ఎకరా 20 గుంటలు శ్మశానవాటికకు ఇస్తామని మాట ఇచ్చారు. వాళ్లతో గ్రామస్తులు మాట్లాడి సెట్​చేసుకోవాలి.   - వరలక్ష్మి, తహసీల్దార్, మానవపాడు