పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శనివారం కోల్కతాలో జరిగిన సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
బెంగాల్ ఎన్నికల్లో పార్టీ గెలుపులో అభిషేక్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఉన్నత పదవి లభించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను నియమించుకొని.. ఆయనతో పార్టీని సమన్వయపరచడంలో అభిషేక్ కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు.
ప్రధాన కార్యదర్శి పదవి వరించడంతో పార్టీలో అభిషేక్ బెనర్జీ ప్రాబల్యం మరింత పెరగనుంది. వాస్తవానికి అభిషేక్కు పార్టీలో ప్రాధాన్యం పెరగడాన్ని జీర్ణించుకోలేకనే.. ఎన్నికలకు ముందు మమత కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సువేందు అధికారి సహా మరికొంత మంది కీలక నేతలు పార్టీని వీడి బీజేపీ లో చేరారు.