ఖబడ్దార్ రేవంత్.. చెంచులతో గోక్కోకు

ఖబడ్దార్ రేవంత్.. చెంచులతో గోక్కోకు

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల

హైదరాబాద్, వెలుగు: యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ చేసిన తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. ‘చెంచులతో గోక్కునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం.. ఖబడ్దార్’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మంగళవారం ఆయన మాట్లాడారు. తీర్మానంపై రేవంత్‌‌‌‌ అనుచితంగా మాట్లాడి అసెంబ్లీతో పాటు ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ప్రజలకు, అసెంబ్లీకి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఓటుకు నోటు, ఆర్టీఐ రెడ్డి, రైఫిల్‌‌‌‌ రెడ్డి పేర్లను తుడిచేసుకోవడానికి రేవంత్ దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు. నల్లమల ప్రజల జీవన విధానం గురించి ఏం తెలుసని పవన్​కల్యాణ్ మాట్లాడుతున్నారని నిలదీశారు. ఏపీలో చెల్లని పవన్.. ఇక్కడ గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 25 నుంచి 2వ విడత గొర్రెల పంపిణీ పథకం మొదలవుతుందని షాద్‌‌‌‌నగర్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌‌‌‌ యాదవ్ తెలిపారు.