మహబూబ్ నగర్: కృష్ణానది జలాల్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని , కానీ అధికార మదంతో కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో పోతిరెడ్డి పాడు అంశంపై మాట్లాడుతూ… పోతిరెడ్డిపాడు నుంచి 406 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తో చెన్నై కు నీళ్లు తీసుకుపోతున్నారన్నారు. మొత్తం 15 తూములతో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని దోచుకెళ్తున్నారని చెప్పారు.
సంగమేశ్వరం నుంచి నీళ్లు తీసుకెళ్లేందుకే ఏపీ – తెలంగాణ చీకటి ఒప్పందంతో 203 జీవో పుట్టుకొచ్చిందని చెప్పారు సంపత్. జగన్ – కేసీఆర్ కలసి ఆడుతున్న ఈ నాటకం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారోద్దని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ట్రిబ్యునల్ కు వెళ్లామని చెప్పారు. జీవో ను వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని చెప్పారు. ఆర్డీఎస్ మీద కేసీఆర్ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. పోతిరెడ్డిపాడు వల్ల జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకపోతే పాలమూరు బిడ్డల భవిష్యత్తు అంధకారమవుతుందని సంపత్ అన్నారు.