లోక్ సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలలుగా ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఉల్లి కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లు( రూ. 45860) గా నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్ మే 4 నుంచి అమల్లోకి వచ్చింది. మహారాష్ట్రలో పోలింగ్ జరగనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
2023 ఆగస్టులో ఉల్లి ఎగుమతిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఇది డిసెంబర్ 31, 2023 వరకు చెల్లుతుంది. ఈ గడువును కేంద్రం మళ్లీ పొడిగించింది. ఉల్లి ఎగుమతులపై మే 3న 40 శాతం సుంకాన్ని విధించిన కేంద్రం..ఇవాళ ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉల్లి ధరలు పెరుగబోతున్నాయా అనే చర్చ మొదలైంది.
2023-24లో(ముందస్తు అంచనా ప్రకారం) ఉల్లి ఉత్పత్తి గత ఏడాది 302.08 లక్షల టన్నులతో పోలిస్తే దాదాపు 254.73 లక్షల టన్నులుగా ఉంటుందని అంచనా. మహారాష్ట్రలో 34.31 లక్షల టన్నులు, కర్ణాటకలో 9.95 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 3.54 లక్షల టన్నులు, రాజస్థాన్లో 3.12 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని గణాంకాలు చెబుతున్నాయి.
నిషేదాన్ని ఎత్తివేయాలని మహారాష్ట్ర ఉల్లి రైతులు ,వ్యాపారులు, నిరసనలు నిరసన చేశారు. దేశంలో ఉల్లి ధరలు పెరుగుతాయనే కారణంతో ప్రభుత్వం ఈ నిషేదాన్ని అలాగే కొనసాగించింది. కానీ సార్వత్రిక ఎన్నికల ముందు నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.