- సెంటర్ ఫర్ గుడ్గవర్నెన్స్తో ఒప్పందం చేసుకున్నం: డిప్యూటీ సీఎం భట్టి
- మహాలక్ష్మీతో లాభాల్లోకి ఆర్టీసీ
- ఎం ఈ -డ్రైవ్ కింద త్వరలో హైదరాబాద్కు 2, 800, నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
- ప్రజాభవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆడబిడ్డలకు ప్రత్యేక కార్డులు ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)తో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్క మహిళకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను అదేశించామని తెలిపారు.
ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ప్రయాణాల కోసం ఇచ్చే కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. ఆర్టీసీలో పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్కు 2,800, నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. వీటికి చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
మహాలక్ష్మి స్కీమ్తో 255 కోట్ల ఉచిత ప్రయాణాలు
మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘ఆర్టీసీలో ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో పీఎఫ్ బకాయిలు రూ.1400 కోట్లు ఉండగా.. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో రూ. 660 కోట్లకు తగ్గించినం. అలాగే సీసీఎస్ బకాయిలు గతంలో రూ.600 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.373 కోట్లకు తగ్గించినం” అని వివరించారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వం అందించిన సహకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
కాస్మెటిక్, మెస్ చార్జీలు పెంచినం
ప్రతి ఏడాది పాఠశాలల ప్రారంభం కంటే ముందుగానే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, షూస్ పంపిణీ చేయాలని, అందుకు సంబధించిన నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలను 200 శాతం పెంచామని చెప్పారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ బిల్లులను చెల్లిస్తున్నట్టు తెలిపారు. విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసకుంటున్నదని చెప్పారు. ఒకేసారి 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసినట్టు తెలిపారు. గతంలో ఎంజేపీలో 327 గురుకులాలకు కేవలం 26 చోట్ల మాత్రమే సొంత భవనాలుంటే.. ఇప్పుడు 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు కార్పొరేట్ తరహాలో భవనాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు.
గురుకులాల అద్దె, మెస్, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. గీత వృత్తిదారుల రక్షణకు ఇప్పటివరకూ 30 వేల కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేసినట్టు తెలిపారు. నాయీ బ్రాహ్మణ, రజక కుల సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు లేకుండా చూస్తూ నెలవారీగా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆఫీసర్లను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఉద్యోగ నియామకాలకు అనుమతివ్వండి: మంత్రి పొన్నం
రవాణా శాఖలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల నియామకాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మార్చి 2026 వరకు 3,233 కండక్టర్ పోస్టులు అవసరం ఉండగా.. తాత్కాలిక నియామకాలతోపాటు 50 శాతం రెగ్యులర్ నియామకాలకు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ల జారీలో ఉన్న ఇబ్బందులు తలెత్తకుండా యూజర్ చార్జీలకు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్పెంచడానికి కొత్త వెహికల్స్కు అనుమతి ఇవ్వాలని , ట్యాక్స్ కలెక్షన్ కోసం ట్యాబ్లు మంజూరు చేయాలని కోరారు.
