- ఈ ఏడాది రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులతో 50 గిగావాట్స్ కెపాసిటీ జోడింపు
- 254 గిగావాట్లకు పెరిగిన రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ
- మొత్తం కరెంట్ ఉత్పత్తిలో 50 శాతం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచే
న్యూఢిల్లీ: ఇండియా రెన్యూవబుల్ సెక్టార్ ఈ ఏడాది కొత్త మైలురాయిని అందుకుంది. ఒక్క సంవత్సరంలోనే 50 గిగా వాట్ల(జీడబ్ల్యూ) సామర్ధ్యాన్ని జోడించింది. దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఫలితంగా ఇండియా కరెంట్ ఉత్పత్తిలో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ వాటా 50 శాతానికి చేరుకుంది. పారిస్ ఒప్పందంలో 2030 లక్ష్యాన్ని ఐదు సంవత్సరాల ముందుగానే సాధించామని ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్యమైన వివరాలు..
ఇండియా మొత్తం కరెంట్ ఉత్పత్తి సామర్థ్యం 510 జీడబ్ల్యూ కాగా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ వాటా 262 జీడబ్ల్యూ. నాన్ ఫాసిల్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ వాటా 254 గిగావాట్లుగా, నూక్లియర్ ప్లాంట్ల కెపాసిటీ 8 గిగావాట్ల ఉంది. బొగ్గు వంటి ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ సామర్ధ్యం 247 గిగా వాట్లు.
2025లో మొత్తం 50 జీడబ్ల్యూ కరెంట్ కెపాసిటీ యాడ్ అయ్యింది. ఇందులో సోలార్ ఎనర్జీ వాటా 35 జీడబ్ల్యూ.
ప్రతి 50 జీడబ్ల్యూ కెపాసిటీ ఏర్పాటుకు దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం. అంటే ఒక మెగావాట్ కెపాసిటీ ఏర్పాటుకు రూ.4 కోట్ల ఖర్చు జరిగింది.
2026లో కూడా ఇదే వేగంతో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ దూసుకుపోతుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. “2025లో రికార్డు స్థాయి వృద్ధి సాధించాం. జనవరి–నవంబర్ మధ్య 45 జీడబ్ల్యూ కెపాసిటీని జోడించాం. డిసెంబర్ చివరికి ఈ నెంబర్ 48–50 జీడబ్ల్యూకి చేరుకుంటుంది. ఈ ఏడాది ఒక్క సోలార్ సెగ్మెంట్లోనే 35 జీడబ్ల్యూ సోలార్ ఇన్స్టలేషన్స్ సాధించాం”అని రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
ఇండియా 2030 నాటికి 500 జీడబ్ల్యూ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ టార్గెట్ చేరుకోవాలంటే 2023–2030 మధ్య రూ.30.54 లక్షల కోట్ల పెట్టుబడులు అవసమవుతాయని ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) అంచనా వేసింది. 2014–-2025 మధ్య పబ్లిక్ ఫైనాన్షియల్ సంస్థలు రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్లకు రూ.10.79 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించాయి. ఒక్క 2024 –25లోనే రూ.2.68 లక్షల కోట్లు ఇచ్చాయి.
ప్రభుత్వ స్కీమ్లతో డిమాండ్
రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ 2025లో దూసుకెళ్లిందని, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలతో కొత్త ప్రాజెక్టులు ఏడాదిలెక్కన 50శాతం పెరిగాయని ప్రీమియర్ ఎనర్జీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినయ్ రుస్తగి అన్నారు. లోకల్గా సెల్స్ తయారీ పెంచేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ రెడీ చేసిందని, దీంతో చాలా కంపెనీలు రెన్యూవబుల్ సెక్టార్లో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నాయని వివరించారు. ఇండియా పవర్ సెక్టార్ కెపాసిటీని విస్తరించడం నుంచి గ్రిడ్ ఇంటిగ్రేషన్ వైపు ఫోకస్ మార్చిందని ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లక్షిట్ అవ్లా పేర్కొన్నారు.
