T20 World Cup: టీ20 ప్రపంచకప్లో గ్రూప్- డీ పోరులో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్కు సౌతాఫ్రికా జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఆల్రౌండర్ జార్జ్ లిండే స్థానంలో ఫాస్ట్ బౌలర్ కార్బిన్ బోష్ను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా అదే జట్టుతో బరిలోకి దిగింది. సూపర్–8 దశకు చేరడం దాదాపు ఖాయం కావడంతో.. ఈ మ్యాచ్ గ్రూప్లో అగ్రస్థానాన్ని నిర్ణయించే కీలక పోరుగా మారింది. ఇప్పటి వరకు రెండు జట్లు తమ మొదటి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించాయి. న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు మంచి ఫామ్లో కనిపిస్తోంది. సౌతాఫ్రికా కూడా అద్భుతమైన ప్రదర్శనలతో ముందుకు సాగుతోంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు గ్రూప్–డి టాప్లో నిలవడమే కాకుండా, సూపర్–8కి అర్హత సంపాదించే అవకాశం ఉంది.
మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (13), రచిన్ రవీంద్ర (13), గ్లెన్ ఫిలిప్స్ (1) మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. కివిస్ మరో ఓపెనర్ ఫిన్ అల్లెన్ మాత్రం 17 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన తర్వాత మార్కో జాన్సన్ బౌలింగ్ లో ప్రోటీస్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్మన్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 48) జస్ట్ మిస్ లో అర్థ శతకాన్ని చేజార్చుకోగా.. డారిల్ మిచెల్ (32) కాసేపు జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
డారిల్ మిచెల్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చిన జేమ్స్ నీషమ్ (23), మ్యాట్ హెన్రీ (9) చివర్లో బ్యాట్ ఝళిపించారు. దీంతో 20 ఓవర్లలో కివీస్ టీం 7 వికెట్లు కోల్పోయి, 175 పరుగులు చేసింది.
