హైదరాబాద్: సీఎం, పీసీసీ, సీపీఐ నేతల చర్చలు సఫలం కావడంతో కొత్తగూడెం మేయర్ పీఠంపై ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్- సీపీఐ పొత్తుతో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని ఇరు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. మేయర్ పదవి సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో.. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు ఖరారైంది.
7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ 4 స్థానాల్లో ఒంటరిగానే మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. నల్గొండ, రామగుండం, మంచిర్యాల, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో జెండా ఎగురవేసింది. నల్గొండలో మొత్తం 48 సీట్లకు 27 చోట్ల, రామగుండంలో 60 సీట్లకు 38, మంచిర్యాలలో 60 సీట్లకు 44 స్థానాల్లో గెలుపొందింది. మహబూబ్ నగర్లో కూడా ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ సహకారంతో కొత్తగూడెం కార్పొరేషన్పై ఎర్రజెండా ఎగురనున్నది. ఇక్కడ 60 సీట్లకు కాంగ్రెస్, సీపీఐకి చెరో 22 సీట్లు వచ్చాయి. ముందుగా బీఆర్ఎస్తో సీపీఐ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయింది. కానీ, బీఆర్ఎస్కు కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చాయి.
రెండు పార్టీలకు కలిపి మెజారిటీ రాకపోవడంతో సీఎం రేవంత్ స్వయంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుకు ఫోన్ చేసి మాట్లాడారు. తాము మద్దతిస్తామని చెప్పడంతో సీపీఐ ఊపిరి పీల్చుకున్నది. పోలింగ్కు ముందు మొదట ఎవరికివారుగా పనిచేసినా చివరికి కలవడంతో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లయింది. ఈ పరిణామంతో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
