2018లో ఓడితే నా పనైపోయిందన్నారు..మళ్లీ 4 నెలల్లోనే ఎంపీగా గెలిచి చూపించా: సీఎం రేవంత్

2018లో ఓడితే నా పనైపోయిందన్నారు..మళ్లీ 4 నెలల్లోనే ఎంపీగా గెలిచి చూపించా: సీఎం రేవంత్

ఓటమితో  నిరాశపడొద్దని.. దానిని ఒక చాలెంజ్‌గా తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2018లో  ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని అన్నారు..  కానీ కేవలం నాలుగు నెలల్లోనే మళ్లీ మల్కాజిగిరి ఎంపీగా గెలిచి చూపించానని గుర్తుచేశారు. ఏకాగ్రతతో  కష్టపడితేనే ఏ రంగంలోనైనా రాణించగలమని... క్రీడాకారులు ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా దూసుకుపోవాలని సీఎం పిలుపునిచ్చారు

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ .. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం కూడా జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.2036లో భారతదేశంలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు  హైదరాబాద్ మహానగరం వేదిక కావాలన్నదే తన లక్ష్యమని  స్పష్టం చేశారు.

గత 12 ఏళ్ల పాలనలో సరైన స్పోర్ట్స్ పాలసీ లేదన్న సీఎం... తాము తెచ్చిన నూతన క్రీడా విధానంలో భాగంగానే ఈ స్పోర్ట్స్ వర్సిటీని నిర్మించామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో నిర్మిస్తున్న ఈ యూనివర్సిటీకి ప్రభుత్వం కేవలం వసతులు మాత్రమే కల్పిస్తుందని... దీని నిర్వహణలో ఎలాంటి రాజకీయ నేతల ప్రమేయం ఉండనివ్వబోమని తేల్చిచెప్పారు.