- మణికొండకు చెందిన నరేందర్ రెడ్డి పేరిట ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు
- బెంగళూరు ఎయిర్ పోర్టు సమీపంలో రూ.కోట్లు విలువ చేసే ఎకరం భూమి
- రిమాండ్ రిపోర్టులో వివరాలు వెల్లడించిన ఏసీబీ
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పట్టుబడిన డీఎస్పీ భీంరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ బినామీ ఆస్తుల చిట్టాను వెల్లడించింది. బెంగళూర్ ఎయిర్ పోర్టు సమీపంలోని దేవనపల్లిలో రూ.కోట్లు విలువ చేసే ఎకరం భూమిని మణికొండకు చెందిన బినామీ నరేందర్ రెడ్డి పేరిట రిజిస్టర్ చేసినట్లు తెలిపింది. సోదాల టైంలో భీంరెడ్డి సహకరించలేదని పేర్కొంది.
భీంరెడ్డి నివాసం ఉంటున్న విల్లాను ఎలా కొనుగోలు చేశారనే విషయంపై సమాధానం ఇవ్వలేదని ఏసీబీ తెలిపింది. తన వద్ద పనిచేస్తున్న హోంగార్డు లక్ష్మణ్ ప్రధాన బినామీగా కర్నాటక, జహీరాబాద్, వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో మొత్తం 46 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. సోదాల్లో 10 బ్యాంక్ అకౌంట్లు, రెండు లాకర్లను గుర్తించినట్లు తెలిపింది. మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.300 కోట్లుగా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలివే..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఆలూరుకు చెందిన సంకిరెడ్డి భీంరెడ్డి 1995 బ్యాచ్లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగంలో చేరిననాటి నుంచి జీతం సహా ఇతర సౌకర్యాల ద్వారా రూ.2.10 కోట్లు ఆదాయం పొందాడు. ఇందులో రూ.1.03 కోట్లు ఖర్చు చేశాడు. రూ.1,06 కోట్లు సేవింగ్స్ ఉండాలి.
కానీ ఏసీబీ సోదాల్లో రూ.10.12 కోట్లు విలువ చేసే ఆస్తులు బయటపడ్డాయి. ఈ లెక్కన భీంరెడ్డి జీతం, ఖర్చులు పోను రూ.9.06 కోట్లు అదనంగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. వీటితో పాటు సోదాల్లో బినామీల పేరిట భారీ ఎత్తున వ్యవసాయ భూములు, ఫ్లాట్లు సంపాదించినట్లు తేల్చింది.
మనకి ఇవ్వాల్సిన వాళ్లు.. నేను ఇవ్వవాల్సినవి..
బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టే క్రమంలో భీంరెడ్డి పక్కా ప్లాన్ అమలు చేశాడు. ఆస్తులను మొదటిగా తన పేరిట కొనుగోలు చేసి తర్వాత క్యాన్సిలేషన్ డీడ్ ద్వారా బినామీల పేరిట ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఇలా రికార్డుల్లో బినామీల పేరిట ఉన్న ఆస్తులకు అసలు యజమాని మాత్రం భీంరెడ్డి. బీనామీల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా డైరీ రాసుకున్నారు. ‘మనకి ఇవ్వాల్సిన వాళ్లు, నేను ఇవ్వవాల్సినవి’ అంటూ అప్పులు, ఆస్తుల వివరాలు వెల్లడించారు.
ప్రాపర్టీ లిస్ట్, చార్ధామ్ పేరిట మే 11న నోట్ రాశారు. ప్రధానంగా తన వద్ద పనిచేసే హోంగార్డు లక్ష్మణ్తో పాటు ప్రైవేట్ వ్యక్తులు మనోజ్గౌడ్ అతని భార్య సరిత, సాయి యతిన్, నితిన్, ఎమ్ఎస్ఎన్ కంపెనీలో పనిచేస్తున్న లడ్డు నార్వ, ఇంద్రకరణ్ రెడ్డి పేరిట భారీగా బినామీ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఏసీబీ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది.
