- ప్రభుత్వ విధానాలతో 14 లక్షల మంది స్టూడెంట్లకు ఇబ్బందులు: బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న హైదరాబాద్లో మిలియన్ మార్చ్ చేపట్టనున్నట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, కేటాయించిన నిధులు, విడుదల చేసినవి, ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య- – భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ’పై అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ (బీసీ జేఏసీ చైర్మన్), బండారు దత్తాత్రేయ (మాజీ గవర్నర్), సిరికొండ మధుసూదనాచారి ( కౌన్సిల్ ప్రతిపక్షనేత), ఎల్.రమణ (బీఆర్ఎస్ ఎమ్మెల్సీ), నెల్లికంటి సత్యం (సీపీఐ ఎమ్మెల్సీ), నిజ్జన రమేశ్(టీజేఎస్) తదితరులు హాజరయ్యారు.
బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు చాలా తేడా ఉందన్నారు. రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఆదాయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించి స్వశక్తితో ఎదగాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల 14 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం గందరగోళంలోకి వెళ్లిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, శ్రీనివాస్ ముదిరాజ్, శ్యాం, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
