హైదరాబాద్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆషాఢ బోనాలు, వార్షిక కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్ష చేశారు. అనంతరం ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించినంత పుణ్యం వస్తుందని భక్తులకు నమ్మకం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని, జలమండలి ద్వారా తాగునీటి సరఫరా నిరంతరం ఉండేలా చూడాలని ఆదేశించారు. వర్షాకాలం కావడంతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బ్యాకప్ జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అలాగే 108 అంబులెన్స్లు, వైద్య బృందాలు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు అందుబాటులో ఉండాలని, భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. సమావేశంలో దేవాదాయశాఖ డైరెక్టర్హనుమంతరావు, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, పోలీస్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, అగ్నిమాపక తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉత్సవాల షెడ్యూల్..
ఈ నెల 20: సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం
21న: ఉదయం 9 గంటలకు అమ్మవారి వార్షిక కల్యాణోత్సవం
22న: సాయంత్రం 6 గంటలకు రథోత్సవం
