టీఎంసీ పార్టీకి ఈడీ భారీ షాక్ ఇచ్చింది. నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మూడు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలను బుధవారం ఫ్రీజ్ చేసింది. ఈ ఖాతాల్లో ఏకంగా రూ.440.42 కోట్ల సొమ్ము ఉంది.
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం భారీ షాక్ ఇచ్చింది. నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మూడు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలను బుధవారం ఫ్రీజ్ చేసింది. ఈ ఖాతాల్లో ఏకంగా రూ.440.42 కోట్ల సొమ్ము ఉంది.
కోల్కతా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా 'కేర్వెల్ ఏవియేషన్' అనే ప్రైవేట్ జెట్, హెలికాప్టర్ల అద్దె సంస్థతో టీఎంసీ జరిపిన లావాదేవీలపై సోదాలు నిర్వహించారు. పార్టీ నిధుల నుంచి సుమారు రూ. 160 కోట్లు కేర్వెల్ ఏవియేషన్ సంస్థకు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది.
ఈ డబ్బుతో విమానం, హెలికాప్టర్ కొనుగోలు చేసి, వాటిని తిరిగి టీఎంసీ పార్టీకే అద్దెకు ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, పార్టీ నిధులపై నియంత్రణ కోసం టీఎంసీలోనే అంతర్గత పోరు నడుస్తోంది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో... గత నెలలోనే కోల్కతా పోలీసులు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిధులను పూర్తిగా ఫ్రీజ్ చేసింది.
