లండన్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ను ఆసియా టెన్నిస్ సమాఖ్య (ఏటీఎఫ్) ప్లేయర్ అంబాసిడర్గా నియమించింది. వింబుల్డన్ చాంపియన్షిప్ సందర్భంగా మంగళవారం ఏటీఎఫ్ అధ్యక్షుడు యూరీ పోల్స్కీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ఆసియాలో టెన్నిస్ అభివృద్ధికి ఊతమివ్వడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు ఏటీఎఫ్ తెలిపింది.
మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో పేస్ విశేష విజయాలు సాధించాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన ఆయన, పురుషుల డబుల్స్లో ఎనిమిది, మిక్స్డ్ డబుల్స్లో పది గ్రాండ్స్లామ్ టైటిళ్లతో మొత్తం 18 గ్రాండ్స్లామ్ కిరీటాలు సాధించాడు. డబుల్స్లో ప్రపంచ నంబర్–1గా నిలిచిన పేస్ 2024లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు.
ప్లేయర్ అంబాసిడర్గా పేస్ ఆసియా వ్యాప్తంగా టెన్నిస్ ప్రచారం, యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం, గ్రాస్రూట్ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించనున్నారు. "ఆసియాలో అపార ప్రతిభ ఉంది. యువ ఆటగాళ్లు ప్రపంచ స్థాయికి చేరేలా ఏటీఎఫ్తో కలిసి పనిచేస్తాను" అని పేస్ తెలిపారు. ఆయన అనుభవం ఆసియా టెన్నిస్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఏటీఎఫ్ అధ్యక్షుడు పోల్స్కీ పేర్కొన్నారు.
