- ఉమా గౌరిని డీహెచ్ ఆఫీస్లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు
- ఇన్చార్జి డీఎంహెచ్ఓగా నీలోఫర్ ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్కు బాధ్యతలు
- వేధింపుల ఫిర్యాదులతో హన్మకొండ డీఎంహెచ్ఓ సరెండర్.. కొత్తగా డాక్టర్ అప్పయ్య నియామకం
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ)గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సి. ఉమా గౌరిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. పరిపాలనా పరమైన కారణాల దృష్ట్యా ఆమెను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఆమె స్థానంలో ప్రస్తుతం నీలోఫర్ హాస్పిటల్ లో సివిల్ సర్జన్, ఆర్ఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. ఆనంద్ ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. తక్షణమే ఆయన బాధ్యతలు స్వీకరించాలని, ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీపీహెచ్ను హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ ఆదేశించారు. హన్మకొండ జిల్లా డీఎంహెచ్ఓపై కూడా ప్రభుత్వం వేటు వేసింది.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. దుర్గా రామ్కుమార్ తన కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన్ను సరెండర్ చేస్తున్నట్లు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ వేధింపులపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సైతం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయన్ను బాధ్యతల నుంచి తొలగించి, డీపీహెచ్ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో సివిల్ సర్జన్ డాక్టర్ అప్పయ్యను హన్మకొండ కొత్త డీఎంహెచ్ఓగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఇద్దరు జిల్లా అధికారుల మార్పులపై బుధవారం వేర్వేరుగా ఆదేశాలు వెలువడ్డాయి.
