అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. జులై10న సినిమా రిలీజ్ సందర్భంగా బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ ‘శ్రీరామపురం అనే ఊరి కథను నందు అద్భుతంగా రాశారు. డైలాగ్స్ గొప్పగా ఉంటాయి. అఖిల్ అన్ని సినిమాలకు కష్టపడుతూనే ఉన్నాడు. ఈ కథలో ఉండే పెయిన్ని అఖిల్ తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు.
తనలోని పెయిన్, ఈ కథలోని పెయిన్కి సింక్ కుదిరింది. నేను దీనికి నిర్మాత కనుక ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. షూటింగ్ టైమ్లో ఫుటేజ్ చూసినప్పుడే గొప్ప సినిమా అవుతుందని ఫీలయ్యా. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. ‘మనం’ తర్వాత నేను అంతగా ఇన్వాల్వ్ అయిన సినిమా ఇది. అది నాన్న గారి కోసం, ఇది నా కొడుకు కోసం. ప్రేమతో, ఇష్టంతో చేసిన ‘లెనిన్’కు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమను తిరిగిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ‘నందు ఆర్గానిక్గా ఈ కథను రాశారు. దీన్ని కమర్షియల్ లెక్కల్లోంచి చూడలేదు. ఈ స్క్రిప్ట్ని ఎక్కువగా గౌరవించా. మేం నిజాయితీగా కష్టపడ్డాం. సినిమాకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి’ అని అన్నాడు. తన మనసుకు ఎంతో దగ్గరైన పాత్రను ఇందులో పోషించానని హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే చెప్పింది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘అఖిల్ కొత్తగా కనిపించడమే ఈ మూవీకి ప్లస్ పాయింట్. అఖిల్, భాగ్యశ్రీ కోసమే కథను రాశారా అన్నట్టుగా అనిపిస్తుంది. మంచి చిత్రం చేశామని గర్వంగా చెప్పగలను’ అని అన్నారు.
దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ.. ‘ఇందులో అఖిల్ కాకుండా లెనిన్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ‘నువ్వొస్తావని’ సినిమా టైమ్లో ఫ్యాన్గా ఉన్న నేను ఇక్కడివరకు వచ్చానంటే ఎంతో సాధించినట్టే. ఈ సినిమాకు నాగార్జున గారి ఇన్పుట్స్ ఎన్నో వాడుకున్నాను’ అని చెప్పాడు. అఖిల్ కెరీర్లో ‘లెనిన్’ ల్యాండ్ మార్క్గా నిలుస్తుందని, ఈ మూవీ క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నాడు.
