హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, షాదాన్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజీలు ఎన్ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు కమిషన్ గుర్తించింది.
ప్రతి మెడికల్ కాలేజీలో 25 కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి లైవ్ ఫీడ్ను ఢిల్లీలోని ఎన్ఎంసీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని ఆదేశించినా ఈ కాలేజీలు ఇప్పటికీ లైవ్ ఫీడ్ ఇవ్వకపోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలాగే కెమెరాల రికార్డింగ్ను కనీసం 30 రోజుల పాటు భద్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈ నిబంధనలు పాటించని 70 మెడికల్ కాలేజీల జాబితాను కూడా ఎన్ఎంసీ విడుదల చేసింది.
