ఆయా పిల్లర్ల కింద నుంచి భారీగా సీపేజీ
20, 22 పిల్లర్ల గోతులకు గ్రౌటింగ్ చేసినా కనిపించని ఫలితం
జియోటెక్నికల్, జీపీఆర్ రిపోర్టులు సీడబ్ల్యూపీఆర్ఎస్కు
ఆ నివేదిక వచ్చాక బ్యారేజీ డ్యామేజ్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజ్ ముందుగా అనుకున్నదానికంటే ఎక్కువేనని తెలుస్తున్నది. 2023 అక్టోబర్ 21న బ్యారేజీకి ప్రమాదం జరిగినప్పుడు.. ఏడో బ్లాక్లోని 19, 20 పిల్లర్లు మాత్రమే భూమిలోకి కుంగిపోయాయి. కానీ, ఆ తీవ్రత పక్కన ఉన్న పిల్లర్లకూ పాకినట్టు తాజాగా తేటతెల్లమైంది. బ్యారేజీలో సీపేజీ కారణంగా కుంగిన పిల్లర్లకు పక్కనే ఉన్న 17, 18, 21,22 పిల్లర్లకూ తీవ్ర నష్టమే జరిగిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆయా పిల్లర్లు, బ్యారేజీ దిగువన గేట్ల మార్గంలోనూ సీపేజీ వల్ల డ్యామేజీ జరిగినట్టు చెబుతున్నారు. 16, 17, 18, 19, 20వ నెంబర్ గేట్ల మార్గంలో సీపేజీ తీవ్రత అధికంగా ఉందని రిపోర్టుల ఆధారంగా నిర్ధారిస్తున్నారు. ఇటు 15, 21వ గేట్ల మార్గంలోనూ సీపేజీ ఉన్నా.. అది స్వల్పంగానే ఉన్నట్టు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజ్పై 2023 అక్టోబర్ నుంచి దాదాపు ఏడాదిన్నరపాటు రకరకాల టెస్టులు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ).. తుది నివేదికను 2025 ఏప్రిల్ 24న ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే.
ఆ రిపోర్టు ప్రకారం అసలు ఏడో బ్లాక్ను పూర్తిగా తొలగించాల్సిందేనని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పింది. దానికి రిపేర్లు చేసి.. పునరుద్ధరించే వరకు బ్యారేజీని వాడుకోవద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీలకు టెస్టులు చేసి.. నేల పరిస్థితులను తెలుసుకున్నాక రిపేర్లు చేయించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద టెస్టులను చేయిస్తున్నది.
బ్యారేజీలో వచ్చిన సీపేజీ ధాటికి ఏడో బ్లాక్లోని పలు పిల్లర్ల కింద 2024లోనే భారీ గోతులను అధికారులు గుర్తించారు. 20, 22 నెంబర్ల పిల్లర్ల కింద కాంక్రీట్, కెమికల్ మిక్సింగ్తో గ్రౌటింగ్చేశారు. కానీ, ఆ గ్రౌటింగ్ కూడా సీపేజీలను అడ్డుకోవట్లేదని తెలుస్తున్నది. 2024, 2025లో వచ్చిన వరదలకు సీపేజీ మరింత పెరిగి.. లోపల చిన్నచిన్న గోతులు ఏమైనా ఏర్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా చోట్ల ఇప్పటికే జియోటెక్నికల్, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ టెస్టులను నిర్వహించారు. బ్యారేజీలో 37 టెస్టులు చేశారు. ఆ టెస్టులను విశ్లేషించేందుకు ఆ నివేదికలను ఇప్పటికే సీడబ్ల్యూపీఆర్ఎస్కు పంపించారు.
తుది నివేదిక వస్తే సీపేజీ తీవ్రత, డిశ్చార్జ్ అప్లిఫ్ట్ ప్రెజర్, ఎగ్జిట్ గ్రేడియెంట్లాంటి వాటిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి ఆ ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇటు బ్యారేజీ పటిష్ఠతను తెలుసుకునేందుకు శాంపిళ్లను సేకరించారు. 19, 20, 21, 23 పిల్లర్ల నుంచి 12 నమూనాలను తీశారు. వాటినీ సీడబ్ల్యూపీఆర్ఎస్ ల్యాబ్ టెస్టులకు పంపించారు. బ్యారేజీల్లోని అన్ని గేట్ల వద్ద ఉన్న రాఫ్ట్ల కింద గోతులను తెలుసుకునేందుకు జీపీఆర్ స్టడీస్ నిర్వహించారు. ఈ టెస్టులూ 79 గేట్ల వద్ద పూర్తయ్యాయి. వీటన్నింటి నివేదికలు వచ్చాక అసలు బ్యారేజీ పరిస్థితి ఏంటన్నది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. డ్యామేజ్ ఏడో బ్లాక్ వరకే ఉన్నదా? పక్కబ్లాక్లకూ పాకిందా? అన్నది తెలియాలంటే ఆ నివేదికలు వస్తేగానీ క్లారిటీ రాదంటున్నారు.
ఎత్తిపోసేందుకు వీలుందా?
మేడిగడ్డ అన్ని గేట్లు తెరచిపెట్టినా వెనుక రిజర్వాయర్ నుంచి ఫ్లోయింగ్కండిషన్లోనే నీటిని ఎత్తిపోయొచ్చన్న చర్చకు అసలు తావే లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలోనూ పరిస్థితి ఎలా ఉందో తెలియదని అంటున్నారు. 2024లోనే ఆ బ్యారేజీలోని 28, 38 నెంబర్ పిల్లర్ల వద్ద భారీ సీపేజీ ఏర్పడింది. ఆ తర్వాత 35, 48 పిల్లర్ల వద్ద కూడా భారీ సీపేజీలు వచ్చాయి. వాటిని తాత్కాలికంగా పూడ్చినా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆ బ్యారేజీలోనూ లోపాలను గుర్తించి అన్నింటినీ పరిష్కరించాకే వాడుకోవాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మేడిగడ్డ నుంచి నీళ్లను అన్నారంలోకి ఎత్తిపోసే పరిస్థితి లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
