కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు ఇవ్వాలి...ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వివరాలు ఇవ్వాలి...ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2014 నుంచి ఈ రెండు పథకాలపై జారీ చేసిన ఎనిమిది జీవోలకు సంబంధించిన వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ పథకాల అమలుకు సంబంధించిన జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన  పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఏవీ శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ వివిధ ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేసి కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. విచారణలో న్యాయమూర్తి మాట్లాడుతూ.. పేద కుటుంబాల యువతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కోర్టులు ఎంత వరకు జోక్యం చేసుకోవాలనే అంశాన్ని ప్రస్తావించారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ పథకాల ఉద్దేశంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అమలు విధానం రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేదని వాదించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు పథకాల కోసం రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫు అదనపు అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇమ్రా ఖా మాత్రం.. ఈ పథకాలు నిరంతరాయంగా అమలవుతున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగ వర్గాలకు చెందిన యువతుల సంక్షేమం కోసమే ఈ పథకాలు కొనసాగిస్తున్నామని వివరించారు. వాదనలు విన్న హైకోర్టు..   కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.