చార్మినార్, వెలుగు: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసినట్లు చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ తెలిపారు. బుధవారం పురానీ హవేలీలోని డీసీపీ ఆఫీస్ లో అడిషనల్ డీసీపీ ఎంఏ మజీద్, మీర్చౌక్ ఏసీపీ జి.శ్యాంసుందర్ కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట నసీబ్ నగర్కు చెందిన అబ్దుల్ రజాక్ ఖాన్ ను అరెస్ట్ చేసి అతని వద్ద 15 నకిలీ సర్టిఫికెట్లు, ఒక ఫోన్, స్కూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
విదేశాలకు వెళ్లే వారికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో మీర్చౌక్ డీఐ ఎన్. సైదయ్య, ఎస్సై సి.అనిత ఎతెబార్ చౌక్లో దాడులు నిర్వహించి రజాక్ ఖాన్ వద్ద పూణేలోని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్, తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన నకిలీ డిగ్రీ గ్రేడ్ కార్డ్ షీట్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ ప్రొవిజనల్, బీఎస్సీ డిగ్రీ గ్రేడ్ కార్డ్ ఫోలియో స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
