మమత పార్టీ ఖాళీ అవుతుంది :మాజీ ఎంపీలు కూడా బీజేపీ జాయిన్

మమత పార్టీ ఖాళీ అవుతుంది :మాజీ ఎంపీలు కూడా బీజేపీ జాయిన్

పశ్చిమ బెంగాల్ లో మరోసారి మమత బెనర్జీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత ప్రారంభమైన వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీ వీడగా.. తాజాగా ముగ్గురు సీనియర్ నేతలు, మాజీ రాజ్యసభ్యులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకా కొందరు పార్టీ అవకాశం ఉండటంతో మరికొద్దిరోజుల్లో పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ రాజ్యసభ సభ్యులు సుస్మితా దేవ్, సుఖేందు శేఖర్ రాయ్, ప్రకాష్ చిక్ బరాక్ గురువారం (జూలై 9) బీజేపీలో చేరారు. ఇటీవల టీఎంసీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ముగ్గురు నేతలకు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

బీజేపీలో చేరే ముందు ఈ ముగ్గురు నేతలు మమతా బెనర్జీ నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు చేశారు. వారి అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తుందని సమీక్ భట్టాచార్య తెలిపారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఎదురైన ప్రతికూల పరిస్థితుల తర్వాత ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల సంఘం జూలై 24న ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది. జూన్‌లో ఈ ముగ్గురు నేతలు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక వీరి చేరికతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ మరింత బలపడటంతో పాటు, రాజ్యసభలో కూడా పార్టీ బలం పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి.