మైట్రో స్లాబులు కూలి ఆటోలు, కార్లపై పడ్డాయి.. నడి రోడ్డుపై భయంకరం..

మైట్రో స్లాబులు కూలి ఆటోలు, కార్లపై పడ్డాయి.. నడి రోడ్డుపై భయంకరం..

ముంబై సిటీ ఉలిక్కి పడింది. ముంబై సిటీలో బిజీగా ఉండే నడి రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ కలకలం రేపింది. 2026, ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం.. ముంబై సిటీ పడమర ఏరియా అయిన LBS రహదారిలో.. నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు స్లాబులు కూలి రోడ్డుపై పడ్డాయి. ఇదే సమయంలో రోడ్డుపై వెళుతున్న ఆటోలు, కార్లపై పడ్డాయి ఈ స్లాబులు. 

ముంబై మెట్రో లైన్ 4 కింద ఈ పనులు జరుగుతున్నాయి. కూలి పడిన మెట్రో స్లాబులతో ఆటోలు, కార్లలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు వెంటనే స్పందించి.. గాయపడిన వాళ్లను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఇప్పుడు వాళ్లు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. గాయాలు తీవ్రంగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. 

మెట్రో రైలు మార్గానికి అటు ఇటు రక్షణగా సిమెంట్ స్లాబులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో నాలుగు స్లాబులు.. 50 అడుగుల ఎత్తు నుంచి పడ్డాయి. సరిగ్గా ఆటో, కార్లపై పడటంతో అవి నుజ్జునుజ్జు అయ్యాయి. స్లాబులు బరువుగా ఉండటంతో.. క్రేన్ల సాయంతో వాటిని తొలగించారు. 

సెకండ్ శనివారం.. వీకెండ్ కావటంతో రద్దీ తక్కువగా ఉందని.. అదే వీక్ డేస్.. సాధారణ రోజుల్లో అయితే ప్రమాదం చాలా చాలా తీవ్రంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్ పై అధికారులు విచారణకు ఆదేశించారు. మెట్రో నిర్మాణ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు లోకల్ పీపుల్..