- మేము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే సరైన నాయకులు లేరు
- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
వికారాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రైతు కుటుంబాలకు సుమారు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులను ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి నిధుల్లేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని రూ.300కు పెంచడం వల్ల కూలీలకు మేలు జరుగుతుందని తెలిపారు. బీజేపీ లో సోషల్ మీడియా చురుగ్గా పని చేయక పోవడంతో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు బయటకు రావడం లేదన్నారు. తాము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే సరైన నాయకులు లేరని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ కరుణం ప్రహ్లాద్ రావు, మాజీ అధ్యక్షులు సదానందరెడ్డి, మాధవరెడ్డి, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, నాయకులు శివరాజ్, రమేశ్కుమార్, పి.నవీన్కుమార్, మారుతి కిరణ్, కేపీ.రాజు, విజయభాస్కర్రెడ్డి, రాచ శ్రీనివాస్రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
