చండీఘర్: ఆన్ లైన్ మోసం వల్ల అప్పుల పాలై ఓ మాజీ ఐపీఎస్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మాజీ ఐపీఎస్ అధికారి అమర్ సింగ్ చాహల్ సోమవారం (డిసెంబర్ 22) పాటియాలాలోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించారు. చాహల్ పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అతన్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక నోట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ALSO READ | మా అన్నను చంపినోళ్లను ఉరి తీస్తేనే మాకు శాంతి: బంగ్లాలో హత్యకు గురైన దీపూ దాస్ సోదరుడు
ఈ నోట్ ప్రకారం.. ఆన్ లైన్లో మోసం పోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాలు, మానసిక క్షోభ వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్ లైన్లో మోసపోయి మాజీ ఐపీఎస్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలకు ఈ ఘటన అద్ధం పడుతోందంటున్నారు.
