అప్పుల బాధకు మరో వ్యాపారవేత్త బలి.. 17వ అంతస్తు నుంచి దూకి 'ముల్తానీ బేకరీ' మాజీ ఓనర్ ఆత్మహత్య!

అప్పుల బాధకు మరో వ్యాపారవేత్త బలి.. 17వ అంతస్తు నుంచి దూకి 'ముల్తానీ బేకరీ' మాజీ ఓనర్ ఆత్మహత్య!

షోలాపూర్ వ్యాపార వర్గాల్లో ఊహించని తీవ్ర దిగ్భ్రాంతి ఘటన చోటు చేసుకుంది. ఐకానిక్ ముల్తానీ బేకరీ మాజీ యజమాని సునీల్ మోతీలాల్ సదరంగాని (59) గురువారం ఓ అపార్ట్‌మెంట్ భవనం 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

మోతీలాల్ సదరంగాని స్థాపించిన ఫెమస్ 'ముల్తానీ బేకరీ'కి సునీల్ మూడవ తరం వారసుడు. ఆయన హయాంలో బేకరీ వ్యాపారాన్ని పిండి మిల్లుల స్థాయికి విస్తరించారు. వ్యాపారంలో అప్పులు పెరిగిపోవడంతో, దివాలా తీసే పరిస్థితి రావడంతో నాలుగేళ్ల క్రితం తన బేకరీని అమ్మేశారు. ఆ తర్వాత పూణేకు మకాం మార్చారు.

 పోలీసుల సమాచారం  ప్రకారం గురువారం మధ్యాహ్నం సునీల్ షోలాపూర్‌లోని ఓ  అపార్ట్‌మెంట్ భవనానికి తన కారులో వచ్చారు. బయోమెట్రిక్ చెకింగ్  తప్పించుకోవడానికి లిఫ్ట్ కాకుండా మెట్ల ద్వారా పై అంతస్తుకు చేరుకున్నారు. టెర్రస్ పక్కన ఆయన నడవడం గమనించిన సెక్యూరిటీ గార్డు, అనుమానంతో ఆయనను కిందకు తీసుకొచ్చాడు. అయితే, కారు తాళాలు పైన మర్చిపోయాను అని గార్డుకు అబద్ధం చెప్పి మళ్లీ పైకి వెళ్లారు. గార్డు వెనుక వెళ్లేలోపే ఆయన 17వ అంతస్తు నుంచి కిందకు దూకేశారు. దింతో ఆయన అక్కడికక్కడే మరణించారు.

గత కొంతకాలంగా పెరుగుతున్న అప్పులు, ఆర్థిక సమస్యల వల్ల ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆయన మానసిక సమస్యలతో కూడా బాధపడుతున్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే  ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.