దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు మారడం, పెట్టుబడిదారులు లాభాల కోసం ప్రాఫిట్ బుకింగ్ ఇందుకు ప్రధాన కారణం. దింతో కిలో వెండి ధర ఏకంగా రూ. 13,000 తగ్గి రూ. 2,68,000 నుంచి రూ. 2,55,000కు పడిపోయింది. అంటే దాదాపు 5 శాతం తగ్గుదల. ఇక 10 గ్రాముల బంగారం ధర రూ. 3,400 తగ్గి రూ. 1,60,600 ఉన్న ధర ఇప్పుడు రూ. 1,57,200కు చేరుకుంది.
బంగారం ధరలు భారీగా పెరగడంతో, చాలామంది లాభాలను క్యాష్ చేసుకోవడానికి అమ్మకాలు మొదలుపెట్టారు. దీనివల్ల దేశీయంగా ధరలు తగ్గాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పురోగతి కనిపిస్తుందన్న ఆశలతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం కూడా బంగారం ధరలపై పడింది.
ఒమన్లో జరుగుతున్న చర్చలు, అమెరికా ఆర్థిక విధానాల వల్ల మార్కెట్లో భారీ ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ఒకానొక దశలో బంగారం, వెండి ధరలు 10 శాతం వరకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ కొంత పుంజుకున్నాయి. విదేశీ మార్కెట్లో బంగారం ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద, వెండి 74 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
